మాస్కో ఉగ్రదాడి 143కు పెరిగిన మృతుల.. 11 మంది అరెస్ట్‌

* మాస్కో ఉగ్రదాడిని ఖండించిన ప్రధాని మోదీ
రష్యా  రాజధాని మాస్కోలో జరిగిన భారీ ఉగ్రదాడి ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య తాజాగా 143కు పెరిగినట్లు క్రెమ్లిన్‌ అధికారులు తాజాగా ప్రకటించారు. సుమారు 140 మందికిపైగా గాయపడినట్లు తెలిపారు. మరోవైపు ఈ ఘనటలో ఇప్పటి వరకూ 11 మందిని అరెస్ట్‌ చేసినట్లు వెల్లడించారు. అరెస్టైన వారిలో నలుగురు ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం.
ఈ దాడిని `అనాగరిక ఉగ్రదాడి’గా పేర్కొంటూ మార్చి 24న `జాతీయ సంతాప దినం’గా పాటించాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ పిలుపిచ్చారు. ఈ దారుణానికి పాల్పడిన మొత్తం నలుగురు సాయుధులను అరెస్ట్ చేశామని చెబుతూ, వారు ఉక్రెయిన్ వైపు వీడుతున్నారని వెల్లడించారు. వారి వెనుక ఎవ్వరు ఉన్నప్పటికీ, ఈ దారుణానికి ఎవ్వరు పాల్పడిన్నప్పటికీ తీవ్రమైన చర్య తీసుకుంటామని దేశ ప్రజలను ఉద్దేశించి టెలివిజన్ లో ప్రసంగిస్తూ హామీ ఇచ్చారు. 
రష్యా రాధాని మాస్కోలోని క్రాకస్‌ సిటీ హాల్‌పై జరిగిన ఉగ్రవాద దాడిని ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. ఈ దుఃఖ సమయంలో రష్యా ప్రభుత్వానికి, ప్రజలకు భారతదేశం అండగా ఉంటుందని చెప్పారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్విట్‌ చేశారు. “మాస్కోలో ఆ దారుణ ఉగ్ర మారణకాండను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బాధితులు కుటుంబాల పట్ల సానుభూతి తెలియజేస్తున్నాం’ అని మోదీ  ‘ఎక్స్’ పోస్ట్‌లో పేర్కొన్నారు. ‘ఈ విషాద సమయంలో రష్యన్ ఫెడరేషన్ ప్రభుత్వం, ప్రజల పట్ల భారత్ సంఘీభావం వ్యక్తం చేస్తోంది’ అని ప్రధాని తెలిపారు.

శుక్రవారం రాత్రి ప్రముఖ రష్యన్‌ రాక్‌ బ్యాండ్ ఫిక్‌నిక్‌ సంగీత కార్యక్రమం జరుగుతున్న క్రాకస్‌ సిటీ కన్సర్ట్‌ హాల్‌లోకి ప్రవేశించిన దుండగులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనకు తామే బాధ్యులమని ఐఎస్‌ఐఎస్‌  ప్రకటించింది. తొలుత కన్సర్ట్‌ హాల్‌లోకి ప్రవేశించిన దుండగులు అక్కడున్నవారిపై కాల్పులు జరిపి బీభత్సం సృష్టించారు. 

మ్యూజిక్‌ షో ముగియడంతో బయటకు వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా కాల్పులు జరిపారు. అయితే ఏం జరుగుతుందో తెలియక అక్కన్నవారు సీట్ల మధ్య దాక్కున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. హాలులో చిక్కుకున్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ఈ ఉగ్రదాడి ఘటనపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని నెల రోజుల క్రితమే రష్యాను హెచ్చరించినట్లు తెలిపింది. మాస్కోలో ఉగ్ర ఘటనపై వైట్‌హౌస్‌  జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి అడ్రియెన్నీ వాట్సన్‌ మాట్లాడుతూ మాస్కోలో ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని నెల రోజుల క్రితమే అమెరికా ప్రభుత్వానికి నిఘా వర్గాల నుంచి సమాచారం అందినట్లు చెప్పారు. 

కాన్సర్ట్‌లు, ప్రజలు ఎక్కువగా గుడిగూడే ప్రదేశాలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు జరగొచ్చని నిఘా వర్గాలు హెచ్చరించినట్లు పేర్కొన్నారు. ఈ సమాచారాన్ని వాషింగ్టన్‌ వెంటనే రష్యా అధికారులకు అందించినట్లు తెలిపారు. ఏదైనా నిఘా సమాచారం అందిన వెంటనే అమెరికా ఆయా దేశాలను అలర్ట్‌ చేస్తుందని ఈ సందర్భంగా వాట్సన్‌ పేర్కొన్నారు.

కాగా, ఉగ్రదాడిలో ఉక్రెనియన్ల పాత్ర ఉన్నట్లు రష్యా అనుమానం వ్యక్తంచేస్తోంది. దాడికి సంబంధించి ముందే హెచ్చరించామని చెప్పిన అమెరికా అందులో ఉక్రేనియన్ల పాత్రకు సంబంధించిన విషయాన్ని దాచిపెడుతున్నదని ఆరోపించింది.