అహ్మదాబాద్లోని గుజరాత్ వర్శిటీలో విదేశీ విద్యార్థులపై దాడిని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా తీసుకుంది. వెంటనే ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించుకుంటూ ఉండాలని , దాడికి దిగిన వారిని అదుపులోకి తీసుకోవాలని కేంద్రం గుజరాత్ ప్రభుత్వానికి సూచించింది. ఇప్పటికే గుజరాత్ హోం శాఖ సహాయ మంత్రి హర్ష సంఘావీ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులతో చర్చించారు. ఘటన పూర్వాపరాలు తెలుసుకున్నారు.
హాస్టల్ గదిలో కొందరు విద్యార్థులు నమాజుకు దిగిన విషయం తెలియగానే ఓ మూక వచ్చి వీరిపై దాడికి దిగడం క్రమేపీ వివాదానికి దారితీసింది. కాగా తాము ఎప్పటికప్పుడు గుజరాత్ ప్రభుత్వంతో దీనిపై చర్చిస్తున్నామని, వివిధ దేశాలకు చెందిన విద్యార్థులపై దాడికి దిగిన వారిని కఠినంగా శిక్షించడం జరుగుతుందని ఈ క్రమంలోనే కేంద్రం తరఫున విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రకటించింది. దాడి ఘటనలో మొత్తం ఐదుగురు విద్యార్థులు గాయపడగా, ఇద్దరిని చికిత్సకు ఆసుపత్రికి తరలించారు. క్యాంపస్లో కానీ, సమీపంలో కానీ తమకు అందుబాటులో మసీదు లేకపోవడం వల్లనే తప్పనిసరిగా తాము ఉంటున్న గదుల్లోనే నమాజు జరిపినట్లు విదేశీ విద్యార్థులు అధికారులకు తెలిపారు. అల్లరి మూక వచ్చి తమను కొట్టిందని, లాప్టాప్లు, సెల్ఫోన్లను ధ్వంసం చేసిందని, అక్కడున్న సెక్యూరిటీ గార్డు కూడా ఏమీ చేయలేకపోయ్యాడని వారు వెల్లడించారు.
దాడిలో ఆఫ్రికా విద్యార్థులు కూడా గాయపడ్డారు. అల్లరిమూకలు కర్రలు రాడ్లతో వచ్చారని వీరు తెలిపారు. తమంతా ఇప్పుడు భయభ్రాంతులమయ్యామని , ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియకుండా ఉందని వాపోయారు. ఘటనను హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ ఖండిస్తూ వెంటనే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా జోక్యం చేసుకోవల్సి ఉందని పేర్కొన్నారు.
అహ్మదాబాద్లోని గుజరాత్ యూనివర్సిటీలో సుమారు 300 మంది విదేశీ విద్యార్థులు చదువుతున్నారు. 75 మంది విదేశీ విద్యార్థులు ఏ బ్లాక్ హాస్టల్లో ఉంటున్నారు. రంజాన్ మాసం నేపథ్యంలో శనివారం రాత్రి ఉజ్బెకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంకకు చెందిన విద్యార్థులు తమ రూమ్స్లో నమాజ్ చేశారు.
సుమారు 25 మంది వ్యక్తులు ఆ బ్లాక్ వద్దకు చేరుకున్నారు. హాస్టల్ రూమ్లో నమాజ్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ హాస్టల్పై రాళ్లు రువ్వారు. అక్కడున్న బైక్లను ధ్వంసం చేశారు. ఈ సంఘటనలో ఐదుగురు విదేశీ విద్యార్థులు గాయపడ్డారు. పోలీసులు అక్కడకు చేరుకోవడంతో ఆ వ్యక్తులు పారిపోయారు.
More Stories
మణిపూర్ లో 6 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్
మణిపూర్లో మిలిటెంట్ల దాడిలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్ల మృతి
ఇక ఏడాదిలో రెండుసార్లు సీబీఎస్ఈ పరీక్షలు