ఎన్‌ఐఏ అదుపులో రామేశ్వరం కేఫ్‌ ప్రధాన నిందితుడు

కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్రఖ్యాత రామేశ్వరం కేఫ్‌ లో పేలుడు కేసులో ప్రధాన నిందితుడిని జాతీయ దర్యాప్తు సంస్థ తాజాగా అరెస్ట్‌ చేసింది. ఈ విషయాన్ని ఎన్‌ఐఏ వర్గాలు బుధవారం వెల్లడించాయి. నిందితుడిని బళ్లారికి చెందిన షబ్బీర్‌గా గుర్తించినట్లు తెలిపాయి. 
 
ఎన్‌ఐఏ అధికారులు ప్రస్తతుం నిందితుడిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నట్లు సదరు వర్గాలు వెల్లడించాయి.  అయితే, ఈ అరెస్టుపై ఎన్‌ఐఏ అధికారిక ప్రకటన చేయలేదు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తికి ఇతను సహకరించినట్లు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే తొలి అరెస్టు చేశారు.
 
 బెంగళూరులోని ప్రముఖ రెస్టారెంట్‌ రామేశ్వరం కేఫ్‌లో మార్చి 1 శుక్రవారం బాంబ్‌ బ్లాస్ట్ ఘ‌ట‌న చోటుచేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ పేలుడులో మొత్తం 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.  ఈ ఘటనలో మాస్క్‌, క్యాప్‌ ధరించిన ఓ వ్యక్తి బస్సులో ప్రయాణించి కేఫ్‌కు వచ్చినట్లు గుర్తించారు. 
 
కేఫ్‌లో పేలుడు జరిగిన గంట తర్వాత అనుమానితుడు బస్సు ఎక్కినట్లు సీసీటీవీ ఫుటేజీలో రికార్డైంది. వీడియోలోని టైమ్‌స్టాంప్ మార్చి 1న మధ్యాహ్నం 2:03 గంటలకు ఉంది. పేలుడు మధ్యాహ్నం 12:56 గంటలకు జరిగింది.  అదే రోజు రాత్రి 9 గంటలకు మరో ఫుటేజీలో అనుమానితుడు బస్ స్టేషన్‌లో తిరుగుతున్నట్లు గమనించారు.
 
దీంతో ఈ పేలుడు ఘటనలో అతడే ప్రధాన నిందితుడిగా అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అతడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి రూ. 10 ల‌క్షల రివార్డు కూడా ఇస్తామ‌ని ఎన్‌ఐఏ ఇప్పటికే ప్రకటించింది. దాదాపు ఘటన జరిగిన 13 రోజులకు ప్రధాన నిందితుడిని ఎన్‌ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.