ఆస్ట్రేలియాలో హైద‌రాబాద్ మ‌హిళ దారుణ హ‌త్య‌

* ప్రమాదంలో మరో తెలుగు వైద్యురాలి మృతి

ఆస్ట్రేలియాలోని  ఓ జలపాతం వద్ద ఫొటోలు తీస్తూ జారిపడి వేమూరి ఉజ్వల తెలుగు అనే వైద్యురాలు మృతి చెందిన విషాద ఘటన మరువక ముందే ఆస్ట్రేలియా మరో ఘటన చోటుచేసుకుంది. తెలంగాణకు చెందిన యువతి దారుణ హత్యకు గురైంది.
 
చెత్తకుప్పలో చైతన్య అనే మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆస్ట్రేలియా విక్టోరియాలోని బక్లీలో ఈ దారుణం చోటుచేసుకుంది.  విక్టోరియాలోని బక్లీలో రోడ్డు పక్కన ఉన్న చెత్త డబ్బాలోఆదివారం నాడు చైతన్య మాధగాని అలియాస్ శ్వేత అనే  హైదరాబాద్ మహిళా మృతదేహాన్ని స్థానిక పోలీసులు గుర్తించారు. 
 
స్థానిక విక్టోరియా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ కు  చెందిన అశోక్ రాజ్, శ్వేతకు వివాహం జరిగింది. తర్వాత ఇద్దరు కలిసి ఆస్ట్రేలియా వెళ్లి అక్కడి విక్టోరియాలోని బక్లీలో ఉన్నారు. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో అశోక్ రాజ్ భార్య శ్వేతను హమార్చాడు. రోడ్డు పక్కన ఉన్న ఓ చెత్తడబ్బాలో శ్వేత మృతదేహాన్ని పడేశాడు.
 
భార్య‌ను చంపిన త‌ర్వాత కుమారుడిని తీసుకుని అశోక్ రాజ్ వరికుప్పల హైద‌రాబాద్ వ‌చ్చాడు. అత్త‌గారింట్లో కొడుకుని వ‌దిలిపెట్టి తిరిగి ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. కేసును ద‌ర్యాప్తు చేసిన విక్టోరియా పోలీసులు  అశోక్ రాజే శ్వేత‌ను హ‌త‌మార్చిన‌ట్లు నిర్ధారించారు. ప్ర‌స్తుతం అశోక్ రాజ్‌ను అరెస్టు చేసిన‌ట్లు స‌మాచారం.

మరోవంక, ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాకు చెందిన వేమూరు ఉజ్వల (23) మార్చి 2న ఆస్ట్రేలియాలోని గోల్డ్‌ కోస్ట్ హింటర్‌ ల్యాండ్‌లోని లామింగ్టన్ నేషనల్ పార్క్‌కు వెళ్లారు. అక్కడ యాన్‌ బాకూచి జలపాతం వద్ద ఫొటోలు తీస్తుండగా జారిపడి మరణించింది.  ఉజ్వల గతేడాది గోల్డ్‌కోస్ట్‌లోని బాండ్ యూనివర్సిటీ నుంచి మెడిసిన్‌ చేశారు.

జలపాతం వద్ద ఫొటోలు తీస్తున్న సమయంలో తన కెమెరా ట్రైపాడ్‌ను ఒక అంచుపై పడింది. దాన్ని తీసుకునే ప్రయత్నంలో కాలు జారీ లోయ పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆమె మృతి చెందింది. ఉజ్వల మృతదేహాన్ని వెలికితీసేందుకు రెస్క్యూ సిబ్బంది ఆరు గంటలకు పాటు శ్రమించారు. ఉజ్వల తల్లిదండ్రులు వేమూరు మైథిలి, వెంకటేశ్వరరావు.  వీరు ఆస్ట్రేలియాలోనే స్థిరపడ్డారు. వైద్యురాలు కావాలనేది ఉజ్వల చిన్ననాటి కల అని తల్లిదండ్రులు తెలిపారు. ప్రస్తుతం ఆమె రాయల్ బ్రిస్బేన్ ఉమెన్స్ ఆసుపత్రిలో వైద్యురాలిగా పనిచేస్తుంది. 

పీజీ పూర్తి చేసి ఉన్నతస్థాయికి చేరుకోవాలనేది ఆమె లక్ష్యమని, కానీ ఇంతలో ఈ దుర్ఘటన జరిగిందని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఉజ్వల అంత్యక్రియల నిమిత్తం ఆమె భౌతిక కాయాన్ని కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఎలుకపాడులోని అమ్మమ్మ, తాతయ్య వాళ్ల ఇంటికి తరలిస్తున్నారు.