రష్యాలో ఉద్యోగాల పేరిట కొందరు ఏజెంట్లు భారతీయులను తీసుకువెళ్లి రష్యా ఆర్మీలో సహాయ సిబ్బందిగా చేరుస్తున్నారని విదేశాంగ శాఖ తెలిపింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించామని, వెంటనే వారిని వదిలిపెట్టాలంటూ మాస్కో దృష్టికి తీసుకు వెళ్లినట్టు పేర్కొన్నది. అధిక జీతాలతో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారతీయులను మోసం చేసి తీసుకెళ్లిన ఏజెంట్లు, వీసా కన్సల్టెంట్లు, ఇతర సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవని ఆ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ హెచ్చరించారు.
రష్యాలో ఉద్యోగాల పేరిట భారీ మోసాలు జరుగుతున్నాయని, అలాంటి ఉద్యోగాల్లో చేరి తమ ప్రాణాలను ప్రమాదంలో పడేసుకోవద్దని భారతీయులకు కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఇద్దరు భారతీయులు చనిపోయినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో కేంద్రం ఈ హెచ్చరిక చేసింది. మోసకారి మాటలతో రష్యా ప్రైవేటు సైన్యంలో భారతీయులను చేరుస్తున్న ఏజంట్లను సిబిఐ గుర్తించిందని, వారిపై కేసులు కూడా నమోదు చేసిందని రణధీర్ జైస్వాల్ శుక్రవారం మీడియా సమావేశంలో చెప్పారు.
చాలా మంది భారతీయులను రష్యా ప్రైవేటు సైన్యంలో చేరేలా ఏజంట్లు మోసగించారని, వారిని వీలయినంత త్వరగా విడిచిపెట్టాలని కోరుతూ తాము ఈ విషయాన్ని రష్యా అధికారుల దృష్టికి బలంగా తీసుకెళ్లినటు ఆయన చెప్పారు. దాదాపు 20 మంది భారతీయులు తమను కాంటాక్ట్ చేశారని, ఇప్పుడు మరి కొంత మంది వీడియోలను కూడా తాము చూశామని ఆయన చెప్తూ, వారిని సంప్రదించడానికి తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
అయితే రష్యా ఆర్మీకి సపోర్టింగ్ స్టాఫ్గా ఎంతమంది భారతీయులు పని చేస్తున్నారో కచ్చితంగా తెలియరాలేదు. తప్పుడు హామీలతో భారతీయులను మోసగించి రిక్రూట్ చేసుకున్న ఏజంట్లు, దుష్టశక్తులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా జైస్వాల్ చెప్పారు. సిబిఐ గురువారం పలు నగరాల్లో సోదాలు నిర్వహించి బలమైన సాక్షాధారాలను సేకరించిందని, పలువురు ఏజంట్లపై మానవ అక్రమ రవాణా కేసులను నమోదు చేసిందని ఆయన తెలిపారు.
More Stories
మణిపూర్ లో 6 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్
మణిపూర్లో మిలిటెంట్ల దాడిలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్ల మృతి
ఇక ఏడాదిలో రెండుసార్లు సీబీఎస్ఈ పరీక్షలు