వ‌య‌నాడ్ నుంచి తిరిగి రాహుల్ గాంధీ పోటీ

లోక్‌స‌భ అభ్య‌ర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ప్రకటించింది. దేశ వ్యాప్తంగా 36 మందితో కూడిన జాబితాను కాంగ్రెస్ పార్టీ  విడుద‌ల చేసింది. ఇందులో ఛ‌త్తీస్‌గ‌ఢ్ రాష్ట్రంలో 6 స్థానాల‌కు, క‌ర్ణాట‌క‌లో 6 స్థానాల‌కు, కేర‌ళ‌లో 15 స్థానాల‌కు, మేఘాల‌యలో 2 స్థానాల‌కు, తెలంగాణ‌లో 4 స్థానాల‌కు, నాగలాండ్, సిక్కిం, త్రిపుర రాష్ట్రాల్లో ఒక్కో స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించింది.
 
కేర‌ళ‌లోని వ‌య‌నాడ్ ఎంపీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి రాహుల్ గాంధీ పోటీ చేయ‌బోతున్నారు. ఛ‌త్తీస్‌గ‌ఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ భ‌గేల్ రాజ్‌నంద్‌గావ్ నుంచి బ‌రిలో దిగ‌నున్నారు. బెంగ‌ళూరు రూర‌ల్ నుంచి డీకే సురేశ్, త్రిశూర్ నుంచి కే ముర‌ళీధ‌ర‌న్, తిరువనంత‌పురం నుంచి శ‌శిథ‌రూర్ పోటీ చేయ‌నున్నారు.
 
క‌ర్ణాట‌క‌లోని ఉడుపి, చిత్ర‌దుర్గ‌, తెలంగాణ‌లోని మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఎంపీ స్థానాల అభ్య‌ర్థుల పేర్ల‌ను హోల్డ్‌లో ఉంచింది. ఇందులో తెలంగాణ నుండి నాలుగు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. జహీరాబాద్- సురేష్ షట్కర్, చేవెళ్ల – సునీత మహేందర్ రెడ్డి, నల్గొండ – కుందూరు రఘువీర్, మహబూబాబాద్ – బలరాం నాయక్ పేర్లను ఏఐసీసీ ప్రకటించింది.
 
మహబూబ్ నగర్ స్థానానికి స్వయంగా టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన వంశీచంద్ రెడ్డి పేరు ఈ జాబితాలో లేక‌పోవ‌డం విశేషం.