దేశంలోనే తొలిసారిగా నేషనల్‌ క్రియేటర్స్‌ అవార్డ్స్‌

దేశంలో ఇక ముందు సోషల్ మీడియా క్రియేటర్లకు కూడా గుర్తింపు దక్కనుంది. ఎందుకంటే ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని భారత్ మండపంలో పలువురు డిజిటల్ కంటెంట్ క్రియేటర్లకు అవార్డులను అందజేశారు. నేషనల్‌ క్రియేటర్స్‌ పేరుతో ఈ అవార్డులను ప్రదానం చేశారు. అయితే ఇలా నేషనల్‌ క్రియేటర్స్‌ అవార్డులను ప్రదానం చేయడం దేశంలోనే తొలిసారి.
 
ఈ అవార్డుల కార్యక్రమంలో మైథిలీ ఠాకూర్‌కు ‘కల్చరల్ అంబాసిడర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు’ను ప్రధాని అందజేశారు. అదేవిధంగా జయ కిషోరికి బెస్ట్ క్రియేటర్ ఫర్ సోషల్ ఛేంజ్ అవార్డు, పంక్తి పాండేకు గ్రీన్ ఛాంపియన్ అవార్డు, పీయూష్ పురోహిత్‌కు ఉత్తమ నానో క్రియేటర్ అవార్డు అందజేశారు.
 
ఈ సంద‌ర్బంగా మోదీ మాట్లాడుతూ  “సృజనాత్మక వీడియోలు, కథనాలతో సమాజంలో మార్పు కోసం కృషి చేస్తున్న కంటెంట్‌ క్రియేటర్స్‌ను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులను నూతనంగా ప్రవేశపెట్టింది. స్టోరీ టెల్లింగ్‌, సామాజిక మార్పు, పర్యావరణ పరిరక్షణ, విద్య, గేమింగ్‌ వంటి వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన వారిని గుర్తించి, ప్రోత్సహించడమే ఈ అవార్డుల ముఖ్య ఉద్దేశం” అని ప్రధాని తెలిపారు..
 
”మహిళా దినోత్సవం, శివరాత్రి రోజున ఈ అవార్డులను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉంది. విజేతలకు నా అభినందనలు. సృజనాత్మకతతో ఈ రోజు మీరంతా ఇక్కడిదాకా చేరుకున్నారు. భారత్‌ భవిష్యత్తు గురించి చర్చించేందుకే మనమంతా ఇక్కడ సమావేశమయ్యాం. పరిస్థితులకు అనుగుణంగా వచ్చే మార్పులను స్వీకరించడం మన బాధ్యత” అని మోదీ చెప్పారు. 
 
తక్కువ ధరకు డేటా, మొబైల్‌ ఫోన్లు లభిస్తుండటంతో ఎంతో మంది కంటెంట్‌ క్రియేటర్లకు అవకాశం లభిస్తోందని పేర్కొంటూ ఈ అవార్డులు దేశంలోని ప్రతి యువ కంటెంట్ క్రియేటర్‌ ప్రతిభకు నిదర్శనం అని ప్రధాని తెలిపారు. గత ఎన్నికల్లో మాదిరే ఈ సారి భాజపా క్లీన్‌స్వీప్‌ చేస్తుందని, అదే తమ లక్ష్యం అని ప్రధాన మోదీ భరోసా వ్యక్తం చేశారు.
 
 ఈ సందర్భంగా స్వచ్ఛ అంబాసిడర్‌ అవార్డు అందుకున్న మల్హర్‌ కలాంబేను ఉద్దేశించి ‘సన్నగా కనిపిస్తున్నావ్‌.. బాగా తినాలి’ అని సరదాగా వ్యాఖ్యానించారు.
సమాజంలో సానుకూల మార్పును తీసుకురావడం, కథలు చెప్పడం, పర్యావరణ సుస్థిరత, విద్య, గేమింగ్ తదితర ఆవిష్కరణలకు ప్రోత్సాహంలో కీలక పాత్ర పోషించిన డిజిటల్ కంటెంట్ క్రియేటర్లను గౌరవించడమే ఈ అవార్డుల ప్రధాన లక్ష్యమని అధికారులు చెప్పారు.
 
ఈ అవార్డుల కోసం 20 విభాగాల్లో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 1.5 లక్షల నామినేషన్స్ వచ్చాయి. వారికి మద్దతుగా పది లక్షల మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. అందులోంచి 23 మందిని విజేతలుగా ఎంపిక చేశారు. వీరిలో ముగ్గురు అంతర్జాతీయ క్రియేటర్స్ ఉన్నారు. మోస్ట్‌ క్రియేటివ్‌ క్రియేటర్‌ అవార్డును మహిళల విభాగంలో శ్రద్ధ, పురుషుల విభాగంలో ఆర్జే రౌనాక్‌ అందుకున్నారు.