‘ది కేరళ స్టోరీ’ నిర్మాతల నుంచి ‘బస్తర్‌: ది నక్సల్‌ స్టోరీ’

గ‌తేడాది ‘ది కేరళ స్టోరీ’ చిత్రంతో సంచలన విజ‌యం అందుకుంది ముంబై ముద్దుగుమ్మ ఆదా శర్మ. ఇక ఈ సినిమా ప్రశంసలతో పాటు విమ‌ర్శ‌లు కూడా అందుకుంది. అయితే ఈ సినిమా అనంత‌రం ఆదా శర్మ మ‌ళ్లీ కేరళ స్టోరీ చిత్ర యూనిట్‌తో చేతులు క‌లిపిన విష‌యం తెలిసిందే.  ఆదా శర్మ తాజాగా నటిస్తున్న చిత్రం ‘బస్తర్‌: ది నక్సల్‌ స్టోరీ’. ఈ సినిమాకు కేరళ స్టోరీ ద‌ర్శ‌కుడు సుదీప్తో సేన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా, విపుల్ అమృత్‌లాల్ షా, ఆషిన్ ఎ షా నిర్మాతలుగా వ్య‌వ‌హారిస్తున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 15న విడుద‌ల కానుంది. 
 
ఇక విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర‌ప‌డ‌టంతో ఇప్ప‌టికే మూవీ నుంచి టీజ‌ర్ విడుద‌ల చేయ‌గా మంచి రెస్పాన్స్ ద‌క్కించుకుంది.  ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా నుంచి మేక‌ర్స్ ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ ప్రాంతంలో జరిగిన మావోయిస్టుల అమానుషాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందిస్తున్నట్లు ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతుంది. 
 
ఇక ఈ సినిమాలో మావోయిస్టులను ప‌ట్టుకునే ఐపీఎస్‌ అధికారి నీరజా మాధవన్ పాత్ర‌లో ఆదా శర్మ క‌నిపించ‌నుంది. ఐసిస్‌, బోకోహరామ్‌ల తర్వాత ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన తీవ్రవాదులు మావోయిస్టులే’, పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధాల్లో కన్నా.. మావోయిస్టుల కారణంగానే చనిపోయిన సైనికులే ఎక్కువ.. అంటూ ట్రైల‌ర్‌లో వ‌చ్చిన డైలాగ్స్ ఇంట్రెస్టింగ్‌గా సాగాయి.