చంపేస్తామని ఎంపీ నవనీత్‌ రాణాకు బెదిరింపులు!

అమరావతి ఎంపీ నవనీత్‌ రాణాకు గుర్తు తెలియని వ్యక్తులు చంపేస్తారంటూ బెదిరించారు. వాట్సాప్‌లో ఆడియోను పంపినట్లుగా పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఆమె పోలీసులను ఆశ్రయించగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చంపేస్తామని తనకు బెదిరింపులు వాట్సాప్‌కు మెస్సేజ్‌ వచ్చిందని.. ఇందులో అసభ్య పదజాలం ఉపయోగించారు. ఈ మేరకు ఆమె వ్యక్తిగత సహాయకుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ఆడియో క్లిప్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో పాటు ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌పై సైతం అసభ్యకర పదజాలాన్ని ఉపయోగించారు. ఎంపీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని పేర్కొన్నారు.  నవనీత్‌ రాణా తెలుగువారి సుపరిచితమే. తెలుగులో పలు చిత్రాల్లో నటించింది.
2004లో వచ్చిన శత్రువుతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. చివరిసారిగా ఫ్లాష్‌న్యూస్‌ చిత్రంలో కనిపించింది. ఆ తర్వాత మహారాష్ట్రకు చెందిన రవిరాణాను పెళ్లి చేసుకొని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.  నవనీత్ రాణా, ఆమె ఎమ్మెల్యే భర్త రవి రాణా ఏప్రిల్ 2022లో ముంబయిలోని అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే వ్యక్తిగత నివాసం వెలుపల హనుమాన్ చాలీసాను పఠిస్తామని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ముంబయి పోలీసులు ఇద్దరిపై దేశద్రోహం కోసం నమోదు చేసి అరెస్టు చేశారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో అమరావతి (ఎస్సీ) స్థానం నుంచి మళ్లీ పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.