తెలంగాణకు ఐఐహెచ్‌టి మంజూరు చేసిన కేంద్రం

తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఇండియన్ ఇన్సిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్‌టి)సంస్థను మంజూరు చేసిందని వ్యవసాయ, మార్కెటింగ్, సహకార జౌళిశాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. కేంద్ర ప్రభత్వం జౌళిశాఖ కార్యదర్శి ఇటివల తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ప్రత్యేకoగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదన చేసినట్టు తెలిపారు. 

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో కలిసి డిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి పియూష గోయల్‌ను కలిసి త్వరితగతిన ఐఐహెచ్‌టని  తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని కోరడం జరిగిందని చెప్పారు. తదుపరి కార్యాచరణ వల్ల కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నాడు తెలంగాణ రాష్టానికి ఐఐహెచ్‌టిని మంజూరుచేసిందని తెలిపారు. 

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ సంస్థను తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రంలోని విధ్యార్థులు స్వరాష్ట్రంలోనే టెక్నికల్ డిగ్రీ, డిప్లొమాలను పొందడానికి అవకాశం ఏర్పడిందని సంతోషం వ్యక్తం చేశారు. గతంలో ఇక్కడీ విధ్యార్థులు ఆంధ్ర, ఒరిస్సాలకు వేలాల్సిన పరిస్థితి ఉండేదని చెప్పారు.

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీలో రెగ్యులర్ శిక్షణలతో పాటు టెక్నికల్ టెక్స్ టైల్స్ సంబంధించిన చదువులు, టెక్స్ టైల్స్ డిజైనింగ్, అప్పారల్స్ డిజైనింగ్, మార్కెటింగ్ , ఇంటర్నేషనల్ ట్రేడ్ లాంటి విషయాలలో బోధనలు అందించడం జరుగుతుందని వివరించారు.

తెలంగాణ రాష్ట్రంలో టిటాప్ పాలసీ (జౌళిశాఖ ఇండస్ట్రీయల్ పాలసీ) వల్ల దేశీయంగానే కాకుండా, అంతర్జాతీయ పరిశ్రమలు రావటం జరుగుతుందని తుమ్మల తెలిపారు. ఈ పరిశ్రమలలో నైపుణ్యం కలిగిన వ్యక్తులు ఎక్కువ మంది అవసరం ఉoటుoదని తెలిపారు. ఐఐహెచ్‌టి ఏర్పాటు చేయడం వల్ల తెలంగాణ విధ్యార్థులకు ఉపాధి పొందేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. 

సాంకేతిక నైపుణ్యం కలిగిన విధ్యార్థులు మన రాష్ట్రంలో తయారు కావడం వల్ల జౌళి పరిశ్రమలో అంతర్జాతీయ స్థాయికి తగిన అభివృద్దికి తీసుకెళ్లడానికి వీలవుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.