షాజహాన్ షేఖ్‌ను సిబిఐ, ఇడి కూడా అరెస్టు చేయవచ్చు

సందేశ్‌ఖలిలో మహిళలపై లైంగిక అత్యాచారాలు, భూముల ఆక్రమణ ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) నేత షాజహాన్ షేఖ్‌ను సిబిఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) లేదా పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్టు చేయవచ్చునని కలకత్తా హైకోర్టు బుధవారం ఆదేశించింది. రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ అభ్యర్థనపై కోర్టు ఈ నెల 26 నాటి తన ఉత్తర్వుపై వివరణ ఇచ్చింది. షాజహాన్ షేఖ్‌ను పోలీస్ అధికారులు అరెస్టు చేయాలని 26న కోర్టు ఆదేశించింది.

ఇడి అధికారులపై దాడిపై దర్యాప్తు చేయడానికి సిబిఐ, పశ్చిమ బెంగాల్ పోలీసులతో సంయుక్త ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఒకరే న్యాయమూర్తి ఉన్న బెంచ్ ఏర్పాటు చేయడాన్ని మాత్రమే ఈ నెల 7 నాటి తన ఉత్తర్వులో కోర్టు నిలుపుదల చేసిందని ప్రధాన న్యాయమూర్తి టిఎస్ శివజ్ఞానం నేతృత్వంలోని డివిజన్ బెంచ్ వివరించింది.

పరారీలో ఉన్న షేఖ్‌ను ‘అరెస్టు చేసేందుకు సిబిఐ లేదా ఇడికి కూడా అవకాశం ఉంది’ అని డివిజన్ బెంచ్ ఆదేశించింది. షేఖ్ చాలా కాలంగా పరారీలో ఉన్నట్లు బెంచ్ తెలిపింది. పశ్చిమ బెంగాల్‌లో రేషన్ పంపిణీ కుంభకోణంపై దర్యాప్తు నిమిత్తం షేఖ్ ప్రాంగణం సోదా కోసం ఇడి అధికారుల బృందం జనవరి 5న ఉత్తర 24 పరగణాల జిల్లా సందేశ్‌ఖలికి వెళ్లినప్పుడు సుమారు వెయ్యి మంది సభ్యుల గుంపు వారిపై దాడి జరిపింది.

 మరోవంక,తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు షాజహాన్ షేక్‌ను 72 గంటల్లోగా అరెస్టు చేయాలని ఆదేశిస్తూ రాష్ట్ర గవర్నర్ ఆనంద బోస్ మంగళవారం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి లేఖ రాశారు. అంతేగాక షాజహాన్‌ను అరెస్టు చేయలేని పక్షంలో అందుకు కారనాలను వివరిస్తూ తనకు 72 గంటల్లో లేఖ సమర్పించాలని కూడా ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. 

సందేశ్‌ఖలీలో కొందరు దుండగులు ఒక చిన్నారిని విసిరి పారేసినట్లు వచ్చిన ఆరోపణలను దర్యాప్తు చేయవలసిందిగా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ ఆదేశించారు. కలకత్తా హైకోర్టు తీర్పు దృష్టా సందేశ్‌ఖలిలో జరిగిన అకృత్యాల ప్రధాన నిందితుడు షాజహాన్ షేక్‌ను తక్షణమే అరెస్టు చేయాలని, అలా చేయని పక్షంలో 72 గంటల్లో తనకు కారణాలు వివరిస్తూ లేఖను సమర్పించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు.

 కొందరు దుండగులు ఒక చిన్నారిని విసిరినట్లు పత్రికలలో వచ్చిన వార్తలోని నిజానిజాలను నిర్ధారించాలని, ఆ ఘటన నిజమేనని తేలిన పక్షంలో నిందితులపై తక్షణమే చర్యలు తీసుకుని తనకు నివేదికను సమర్పించాలని ఆ లేఖలో గవర్నర్ పేర్కొన్నారు.