అఖిలేష్ యాదవ్‌కు సీబీఐ సమన్లు

అఖిలేష్ యాదవ్‌కు సీబీఐ సమన్లు
ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌కు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) బుధవారం సమన్లు ​జారీ చేసింది. అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించిన విచారణ కోసం ఫిబ్రవరి 29న తమ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించింది. అఖిలేష్‌ యాదవ్‌ను ఈ కేసులో సాక్షిగా సీబీఐ గురువారం ప్రశ్నించనున్నది. 160 సీఆర్‌పీసీ కింద దర్యాప్తు సంస్థ ఈ సమన్లు పంపింది.
 
కాగా, ఉత్తరప్రదేశ్‌లోని ఏడు జిల్లాలైన షామ్లీ, కౌశాంబి, ఫతేపూర్, డియోరియా, సహరాన్‌పూర్, హమీర్‌పూర్, సిద్ధార్థనగర్‌లో అక్రమ మైనింగ్ కేసులు నమోదయ్యాయి. 2012-2016 మధ్య ప్రభుత్వ అధికారులు నియమాలు, నిబంధనలను ఉల్లంఘించి మైనింగ్ సైట్‌లను కొందరికి అక్రమంగా కేటాయించినట్లు సీబీఐ ఆరోపించింది. 

హమీర్‌పూర్‌‌(యూపీ)లో 2012-2016 మధ్య మైనర్ మినరల్స్ అక్రమ మైనింగ్‌కు ప్రభుత్వాధికారులు అనుమతించారని, నేరపూరిత కుట్ర ఇందులో ఉందని సీబీఐ ఆరోపణగా ఉంది. ఈ-టెండరింగ్ ప్రక్రియను ఉల్లంఘించి అక్రమంగా ఇసుక మైనింగ్‌కు ఫ్రెష్ లీజ్‌లు ఇవ్వడం వల్ల ప్రభుత్వ ఖజానాకు గండి పడిందని, ఇందుకు ప్రతిగా అధికారులు, మరికొందరు లబ్ది పొందారని ఆరోపిస్తోంది. ఎన్‌జీటీ ఆదేశాలను ఉల్లంఘించి మైనింగ్ హక్కులు ఇచ్చినట్లు అభియోగాలు మోపింది. 2012- 2013 జూన్‌ మధ్య మైనింగ్ శాఖ నిర్వహించిన అఖిలేష్‌ యాదవ్‌ను సాక్షిగా విచారణకు రావాలంటూ సీబీఐ సమన్లు జారీ చేసింది.

అక్రమ మైనింగ్‌కు సంబంధించి రాష్ట్రం లోని ఏడు జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. 2012 నుంచి 2016 మధ్య కాలంలో నిబంధనలను ఉల్లంఘించి అధికారులు గనులను కేటాయించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యం లోనే సిబిఐ దర్యాప్తు జరుపుతోంది. 2012 నుంచి 2017 మధ్య కాలంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా అఖిలేశ్ పని చేశారు. 2012 13లో మైనింగ్ విభాగం బాధ్యతలు పర్యవేక్షించారు.