మరోసారి అత్యంత ప్రజాదరణ కలిగిన దేశాధినేతగా మోదీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి ప్రపంచంలోకెల్లా అత్యధిక ప్రజామోదం గల నేతగా నిలిచారు. దేశంలో మోదీ నాయకత్వాన్ని 78 శాతం మంది ప్రజలు సమర్థిస్తుండగా, 17 శాతం మంది మాత్రమే వ్యతిరేకిస్తున్నట్లు ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. యుఎస్‌కు చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన దేశాధినేతల జాబితాను విడుదల చేసింది. 
 
ఈ జాబితాలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అగ్రస్థానంలో నిలవడం విశేషం. భారతదేశంలో 78 శాతం మంది ప్రజలు ప్రధాని మోదీ నాయకత్వాన్ని కోరుకుంటుండగా, 18 శాతం మంది మాత్రం వ్యతిరేకిస్తున్నారు. మరో ఆరు శాతం మంది ఎటువంటి అభిప్రాయాన్ని వెల్లడించలేదు.  ఇక మోదీ తర్వాతి స్థానంలో మెక్సికో ప్రెసిడెంట్ మాన్యుయెల్ లోపేజ్ ఒబ్రాడోర్ నిలిచారు. ఆయన నాయకత్వాన్ని 65 శాతం మంది ప్రజలు ఆమోదిస్తుండగా, 29 శాతం మంది తిరస్కరిస్తున్నారు. మరో ఐదు శాతం మంది మాత్రం ఎలాంటి అభిప్రాయాన్ని వెల్లడించట్లేదు.

ఆ తర్వాత 63 శాతం రేటింగ్‌తో అర్జెంటీనా ప్రధాని జావీర్‌ మిలే మూడో స్థానంలో, 52 శాతం రేటింగ్‌తో పోలాండ్‌కు చెందిన డొనాల్డ్‌ టస్క్‌ నాలుగో స్థానం, స్విట్జర్లాండ్‌ ప్రధాని వియోలా అమ్‌హర్డ్‌ 51 శాతం రేటింగ్‌తో ఐదో స్థానంలో నిలిచారు. బ్రెజిల్‌కు చెందిన లులా డ సిల్వా, ఆస్ట్రేలియాకు చెందిన ఆంథోనీ అల్బనీస్‌ వరుసగా ఆరు, ఏడు స్థానాల్లో నిలిచారు. 

వారి నాయకత్వాన్ని 46 శాతం మంది ప్రజలు ఆమోదిస్తున్నారు. ఇటలీ మాజీ ప్రధాని జార్జియా మెలోనీ ఈ సర్వేలో ఎనిమిదో స్థానంలో నిలిచారు. 41 శాతం మంది ఇటలీ వాసులు ఆమె నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ఇక స్పెయిన్‌కు చెందిన పెడ్రో, బెల్జియంకు చెందిన అలెగ్జాండర్ డి క్రూ 38 శాతం ప్రజామోదంతో వరుసగా తొమ్మిది, పది స్థానాల్లో నిలిచారు.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మాత్రం ఈ జాబితాలో 11వ స్థానంలో నిలిచారు. బైడెన్‌ నాయకత్వాన్ని 37 శాతం మంది మాత్రమే కోరుకుంటుండగా, 55 శాతం మంది తిరస్కరిస్తున్నారు. ఈ సర్వేలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు 29 శాతం, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌కు 25 శాతం, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌కు కేవలం 23 శాతం మాత్రమే ఆమోదం లభించింది.