రైతులు- కేంద్ర ప్రభుత్వం మధ్య నెలకొన్న ప్రతిష్టంభనకు ఇప్పట్లో ముగింపు పడే సూచనలు కనిపించడం లేదు! ఎంఎస్ఏపీ, రుణమాఫీ సహా పలు డిమాండ్ల కోసం ఢిల్లీకి పాదయాత్ర చేయాలని పట్టుదలతో ఉన్న రైతు సంఘాల నేతలతో కేంద్ర ప్రభుత్వం జరిపిన నాలుగో దఫా చర్చలు కూడా విఫలమయ్యాయి. కేంద్రం ఇచ్చిన ప్రతిపాదనలను తిరస్కరించారు.
తమ డిమాండ్లను ఆమోదించకుంటే ఫిబ్రవరి 21న ఢిల్లీకి పాదయాత్ర చేస్తామని రైతు నాయకులు ప్రకటించారు. మిగిలిన డిమాండ్లపై కూడా ప్రభుత్వం నుంచి సమాధానాలు చెప్పాలని కోరారు. ప్రస్తుతం 23 పంటలకు ప్రభుత్వం ఎంఎస్పీ హామీ ఇవ్వాలని, మిగిలిన పంటలకు కూడా అధ్యయనం చేసి హామీ ఇవ్వాలని తెలిపారు. చర్చల్లో భాగంగా ఐదు పంటలను 5ఏళ్ల పాటు, పాత ఎంఎస్పీకి కొనుగోలు చేస్తామని కేంద్ర మంత్రులు రైతులకు ఆదివారం రాత్రి చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లు సోమవారం అర్ధరాత్రి, రైతు సంఘాల నేతలుస్పష్టం చేశారు. “కేంద్రం చేసిన ప్రతిపాదన.. ఆమోదయోగ్యంగా లేదు. ఢిల్లీ వైపు మా మార్చ్ని కొనసాగిస్తాము. శాంతియుతంగా నిరసనలు చేపడతాము,” అని పంజాబ్, హరియాణా మధ్యలో ఉన్న శంభు సరిహద్దు వద్ద నిర్వహించిన ప్రెస్ మీట్లో రైతు నాయకుడు శర్వాన్ సింగ్ పంధేర్ తెలిపారు.
“ఆదివారం రాత్రి.. ప్రభుత్వం ఓ ప్రతిపాదన చేసింది. మేము దానిపై అధ్యయనం చేశాము. 2,3 పంటలకే కనీస మద్దతు ధరను అప్లై చేయడంలో అర్ధం లేదు. ఇతర రైతులు ఏమైపోతారు?” అని మరో రైతు నేత జగ్జీత్ సింగ్ దల్లెవాల్ ప్రశ్నించారు.
“పప్పు ధాన్యాలపైనే ఎంఎస్పీ హామీ ఇస్ కేంద్రంపై అదనంగా రూ. 1.5 లక్షల కోట్ల భారం పడుతుందని మంత్రులు చెప్పారు. కానీ అన్ని పంటలకు ఎంఎస్పీ ఇచ్చినా.. రూ. 1.75 లక్షల కోట్లే అవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ కేంద్రం పామ్ ఆయిల్ ని దిగుమతి చేసుకునేందుకు రూ 1.75 లక్షల కోట్లు ఖర్చు చేస్తుంది. ఆ నూనె ప్రజల ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. అదే డబ్బులతో రైతులకు సాయం చేస్తే మేము మంచి విధంగా ఆయిల్సీడ్స్ని పెంచుతాము,” అని దల్లెవాల్ స్పష్టం చేశారు.
“కేంద్రం చేసిన ప్రతిపాదన.. రైతులకు సాయం చేయదు. మేము మొత్తం 23 పంటలకు ఎంఎస్పీ అడిగాము. అది ‘కనీస మద్దతు ధర’. అది ఆదాయం కాదు. మేము బతకడానికి అది సాయం చేస్తుంది. చట్టబద్ధంగా హామీ ఇవ్వకపోతే.. రైతు నిరసనలు కొనసాగుతాయి. ప్రతిపాదనను మేము తిరస్కరిస్తున్నాము,” అని రైతు నేత దల్లెవాల్ తెలిపారు. కనీస మద్దతు ధరతో పాటు రుణ మాఫీ వంటి అంశాలను కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు.
More Stories
బిజెపి-ఎన్డిఎ తప్ప మరెవ్వరు ప్రభుత్వం ఏర్పాటు చేయలేరు
దుమారం రేపుతున్న బెంగాల్ గవర్నర్ పై లైంగిక ఆరోపణలు
అమేథిలో కాంగ్రెస్ ఓటమిని అంగీకరించింది