జన్వాడలో ఘర్షణలను రెచ్చగొడుతున్న ప్రవీణ్ కుమార్ ను అరెస్ట్ చేయాలి

రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం జన్వాడ గ్రామంలో జరిగిన గొడవలను రెచ్చగొడుతున్న రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ను వెంటనే అరెస్టు చేయాలని  విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు సురేందర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పండరీనాథ్, ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరాములు డిమాండ్ చేశారు. 
 
రోడ్డు నిర్మాణం పనుల సందర్భంగా కావాలని హిందువులపై దాడికి దిగుతున్నారని వారు విమర్శించారు. అసలు క్రైస్తవులుగా కొనసాగుతున్న వ్యక్తులు ఎస్సీలుగా చెప్పుకోవడం సరికాదని, అది రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేశారు. ఎస్సీ సర్టిఫికెట్ పేరుతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కొనసాగిస్తున్న క్రైస్తవులను వెంబడే గుర్తించి వారి సర్టిఫికెట్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 
 
చర్చి కోసం పోరాడుతున్న ఎస్సీలు ఎవరైతే ఉన్నారో వారందరి సర్టిఫికెట్లను రద్దు చేసి బీసీ సర్టిఫికెట్ ఇవ్వాలని కోరారు. వాళ్ల సర్టిఫికెట్ రద్దు కోసం ఇంతకు మించిన పెద్ద సాక్ష్యం ఇంకొకటి లేదని తేల్చి చెప్పారు. అమాయక హిందువుల ఇళ్లలోకి చొరబడి దాడులకు పాల్పడుతూ అక్రమ కేసులను నమోదు చేసి అన్యాయంగా అరెస్టు చేస్తున్న పోలీసులు వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. 
 
చట్టాన్ని చేతిలోకి తీసుకొని విధ్వంసాలకు పాల్పడుతున్న క్రైస్తవ మాఫియాను అడ్డుకొని తీరుతామని పేర్కొంటూ బిఎస్పీని అడ్డం పెట్టుకొని క్రైస్తవ మతమార్పిడికి పాల్పడుతున్న ఆ వ్యక్తిపై ఆ పార్టీ జాతీయ నేత మాయావతి కూడా దృష్టి సారించాలని సూచించారు. ఎట్టి పరిస్థితులలో అక్రమ నిర్మాణాలను తొలగించాల్సిందేనని స్పష్టం చేశారు. 
 
గురువారం రాత్రి నుంచి అన్యాయంగా అరెస్టు చేసిన బజరంగ్ దళ్ కార్యకర్తలను వెంబడి విడుదల చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. భాగ్యనగర్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఉన్నటువంటి బజరంగ్ దళ్, వీహెచ్‌పీ   కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని ఖండించారు. ఎంతటి నిర్బంధాలు కొనసాగిన మోకిలా పోలీస్ స్టేషన్ ను ముట్టడించి తీరుతామని స్పష్టం చేశారు.