లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి ఆప్

లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి ఆప్
ప్రతిపక్ష ఇండియా కూటమిలో ఎవరికివారే యుమునా తీరే అన్నట్లుగా మారింది. రాబోయే ఎన్నికల్లో లోక్‌సభ స్వతంత్రంగానే పోటీ చేస్తామని ఇప్పటికే ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్‌తో పొత్తు ఉండబోదని ఇప్పటికే స్పష్టం చేసింది. తాజాగా ఆప్‌ రాజకీయ వ్యవహారాల కమిటీ (పిఎసి) సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. 
 
సమావేశంలో బరిలో దింపాల్సిన అభ్యర్థులపై సైతం చర్చించగా పేర్లను మాత్రం ప్రకటించలేదు. ప్రస్తుతం ఢిల్లీలో కాంగ్రెస్‌తో పొత్తుపై చర్చలు జరుగుతున్నాయి.
పొత్తులు తేలితే నెలాఖరులోగా అభ్యర్థులను ప్రకటిస్తే పంజాబ్‌లో సైతం జాబితాను ఖరారు చేసే అవకాశం ఉందని ఆప్‌ వర్గాలు తెలిపాయి.
 
ఢిల్లీలోని ఏడు లోక్‌సభ నియోజకవర్గాలలో కేవలం ఒక్కంటే ఒక్క స్థానాన్ని మాత్రమే కాంగ్రెస్ పార్టీకి కేటాయిస్తామని ఆప్ తెగేసి చెప్పడంతో అక్కడ కూడా పొత్తు కుదిరే అవకాశం కనిపించడం లేదు.  ప్రతిభ ప్రాతిపదికన చూస్తే కాంట్రెస్‌కు ఢిల్లీలో ఒక్క సీటును కూడా పొందే అర్హత లేదని, కాని పొత్తు ధర్మాన్ని దృష్టిళో పెట్టుకుని ఆ పార్టీకి ఢిల్లీలో ఒక సీటు ఇస్తాం అంటూ  ఆప్ ఎంపి సందీప్ పాఠక్ చేసిన వాఖ్యలు రెండు పార్టీల మధ్య అగ్గి రాజేస్తున్నాయి. 
 
రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం అనంతరం పంజాబ్‌ కో ఇన్‌చార్జి సందీప్‌ పాఠక్‌ మాట్లాడుతూ పంజాబ్‌లో రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేయాలని నిర్ణయించాయని, ఈ నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు తెలిపారు. అయితే లోక్‌సభ ఎన్నికలకు చాలా తక్కువ సమయం మాత్రమే ఉందని, త్వరలో అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలిపారు. 
 
ఇదిలా ఉండగా పంజాబ్‌లో ఆప్‌ ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేస్తుందని పంజాబ్‌లో జరిగిన ర్యాలీలో ముఖ్యమంత్రి భగవంత్ మాన్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకే కింది స్థాయి నుంచి అందుకు సన్నాహాలు ప్రారంభించాలని కార్యకర్తలకు సూచనలు చేశారు. అయితే, ఆప్‌- కాంగ్రెస్‌ పొత్తులో ఉన్నా కలిసి పోటీ చేయడానికి ప్రధానంగా ఇరు పార్టీల నేతలు సంసిద్ధతంగా లేరు. 
 
ఇలాంటి పరిస్థితుల్లో హైకమాండ్‌ సైతం నిర్ణయం తీసుకోకపోవడానికి కారణం ఇదేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్‌ బలం పెరుగుతుందని అంచనా వేస్తున్నది. మరో వైపు ఆమ్‌ ఆద్మీ సైతం పంజాబ్‌లో భారీ విజయం సాధించింది. ఈ ఎన్నికల్లోనూ అదే పరిస్థితి ఉంటుందని అంచనా వేస్తున్నది. గతేడాది మే నెలలో జరిగిన జలంధర్‌ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో సుశీల్‌ కుమార్‌ రింకూ భారీ ఓట్ల తేడాతో విజయం సాధించారు.