బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఒరవడిలోనే కాంగ్రెస్ ప్రభుత్వ బడ్జెట్

అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆశజనకంగా లేదని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గత పాలకుల బడ్జెట్ అంచనాలకు, ఖర్చుకు సంబంధం లేకుండా పోతుందంటూ ఏకరువు పెట్టారని ప్రస్తుతం బిఆర్‌ఎస్ బాటలో పయానించిందని బిజెపి నేత, మాజీ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ పెదవి విరిచారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.2,75,891 కోట్లలో రూ.40 వేల కోట్లకు పై చిలుకు ఖర్చు పెట్టే ఆస్కారం లేదని స్పష్టం చేశారు. 

 కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చూస్తుంటే రూ. 5 లక్షల కోట్లు ఖర్చు పెడితేనే హామీలు అమలయ్యేలా కనపడుతున్నాయని ఆయన తెలిపారు. వ్యవసాయ శాఖకు రూ.19,746 కోట్లు మాత్రమే కేటాయించారని, రైతుబంధు కోసం రూ. 15 వేలు, వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12 వేల చొప్పున ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. 

 రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ అమలు చేస్తామని హామీ అమలు అయ్యే పరిస్ధితి కనిపించడంలేదని రాజేందర్ తెలిపారు.  రాష్ట్రంలోని 18 ఏండ్లు నిండిన ప్రతి మహిళకు రూ.2500 ఆర్థిక సాయం ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించిందని, వితంతువులకు, ఒంటరి మహిళలకు రూ.4 వేల చొప్పున ప్రతినెలా ఇవ్వాల్సి ఉందని బడ్జెట్ లో మాత్రం ఎక్కడా నిధులు కేటాయించలేదని ఆయన మండిపడ్డారు. 

ఇచ్చిన హామీలు అమలు చేస్తానని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల్లో మాత్రం స్పష్టత ఇవ్వలేదని ఆయన విమర్శించారు. హుజురాబాద్ తో పాటు మిగతా నియోజకవర్గాల్లో దళితబంధుకు నోచుకోని కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా దళితబంధు ఇవ్వాలని రాజేందర్ డిమాండ్ చేశారు. గొల్ల కురుమలకు రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సాయంపై స్పష్టత కనపడటం లేదని చెబుతూ కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు చేయకుంటే ప్రజాక్షేత్రంలో తిరుగుబాటు తప్పదని ఆయన హెచ్చరించారు.