దేశీయ దిగ్గజ సంస్థ, టాటాల నేతృత్వంలోని టాటా గ్రూప్ మరో అరుదైన ఘనత సాధించింది. భారతదేశానికి చెందిన ఏ కంపెనీ ఇప్పటి వరకు అందుకోని రికార్డును తన పేరిట నమోదు చేసింది. టాటా గ్రూప్ మార్కెట్ విలువ తొలిసారి రూ.30 లక్షల కోట్లు దాటింది. ఈ మార్క్ దాటిన తొలి భారత కంపెనీగానూ ఘనత సాధించింది.
ఈ మార్క్ దాటేందుకు ఇటీవలి కాలంలో టాటా గ్రూప్ కంపెనీలైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ( టీసీఎస్), టాటా పవర్, టాటా మోటార్స్, ఇండియన్ హోటల్స్ షేర్లు రాణించడం కారణమయ్యాయి. గ్రూప్ కంపెనీల షేర్లు రాణిస్తున్న క్రమంలో మార్కెట్ విలువ గణనీయంగా పెరిగింది. టాటా గ్రూప్ కంపెనీల్లో ప్రధాన కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ షేరు పరుగులు పెడుతోంది.
ఈ కొత్త ఏడాది 2024లో ఇప్పటివరకు 9 శాతం మేర పెరిగింది. అలాగే టాటా మోటార్స్ కంపెనీ షేర్లు 20 శాతం మేర లాభపడ్డాయి. టాటా పవర్ కంపెనీ స్టాక్ 18 శాతం పెరిగింది. అలాగే టాటా గ్రూప్ నకు చెందిన మరో సంస్థ ఇండియన్ హోటల్స్ షేర్లు ఈ కొత్త ఏడాదిలో 16 శాతం మేర పెరిగాయి. మొత్తంగా టాటా గ్రూప్ నకు చెందిన 24 కంపెనీలు స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయ్యాయి.
మరోవైపు టాటా గ్రూప్ నకు చెందిన తేజస్ నెట్ వర్క్, టాటా ఎలెక్సీ, టాటా కెమికల్ షేర్లు దాదాపు 10 శాతం వరకు నష్టపోవడం గమనార్హం. టాటా గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ పెరుగుదలలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ది కీలక పాత్ర. ఇటీవల ప్రకటించిన త్రైమాసిక ఫలితాల్లో మంచి లాభాలు నమోదు చేసింది. మూడో త్రైమాసికంలో 8.1 బిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్లు అందుకున్నట్లు త్రైమాసిక ఫలితాల ప్రకటన సందర్భంగా వెల్లడించింది.
ఈ కారణంగానే ఇటీవలి కాలంలో టీసీఎస్ షేర్లు రాణిస్తున్నట్టు తెలుస్తోంది. మంగళవారం నాటి ట్రేడింగ్ చూసుకుంటే టీసీఎస్ షేర్లు 3 శాతానికిపైగా లాభపడ్డాయి. దీంతో ఆ కంపెనీ మార్కెట్ విలువ రూ.15 లక్షల కోట్లు దాటింది. టాటా గ్రూప్ మొత్తం మార్కెట్ విలువలో టీసీఎస్ దే సగం వాటా ఉండడం గమనార్హం.
మరో వైపు టాటా మోటార్స్ మూడో త్రైమాసికంలో మెరుగైన విక్రయాలు నమోదు చేసింది. ముడి సరుకుల ధరలు తగ్గడం, వాహనాలకు డిమాండ్ పెరగడం వంటి కారణాలతో భారీ లాభాలు నమోదు చేసింది. దీంతో ఈ కంపెనీ షేర్లు సైతం రాణించాయి. అలాగే రెన్యువబుల్ ఎనర్జీపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిన క్రమంలో టాటా పవర్ షేర్లు పరుగులు పెడుతున్నాయి.

More Stories
బీహార్ లో అన్ని ఎన్నికల రికార్డ్లను బ్రేక్ చేస్తాం
బెంగాల్ లో 1000కి పైగా పౌరసత్వ శిబిరాల ఏర్పాట్లలో బీజేపీ
కర్నూలు జిల్లాలో బస్సుకు దగ్ధంలో 19 మంది సజీవ దహనం