130 మీటర్ల పొడవైన మావోయిస్టుల సొరంగం బహిర్గతం

అడవుల్లో కూంబింగ్‌ సమయంలో భద్రతా సిబ్బంది నుంచి తప్పించుకోడానికి మావోయిస్ట్‌లు కొత్త వ్యూహాలను అనుసరిస్తున్నారు. కూంబింగ్ కోసం డ్రోన్‌ కెమెరాలను వాడటంతో వాటికి చిక్కకుండా ఉండేందుకు రహస్య సొరంగాలను ఉపయోగిస్తున్నట్టు బయటపడింది. ఛత్తీ‌సగఢ్‌-తెలంగాణ సరిహద్దుల్లో భారీ ఎత్తున సొరంగాలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. దంతేవాడ జిల్లా భైరంగఢ్‌ పోలీ‌సస్టేషన్‌ పరిధిలోని ఇంద్రావతి నది సమీపంలో130 మీటర్ల పొడవైన పెద్ద  సొరంగ మార్గాన్ని సీఆర్పీఎఫ్‌, డీఆర్జీ జవాన్లు బుధవారం గుర్తించారు.
దంతెవాడ పోలీసు సూపరింటెండెంట్ గౌరవ్ రాయ్ మాట్లాడుతూ, 10 అడుగుల లోతైన సొరంగాన్ని స్థానిక గిరిజన యువకులతో కూడిన జిల్లా రిజర్వ్ గార్డ్ (డిఆర్జి) జవాను మొదట గుర్తించాడని చెప్పారు.  ఆ రహస్య స్థావరాన్ని ఎవరూ గుర్తించకుండా దానిపై చెత్త వేశారని తెలిపారు. జిల్లా రిజర్వ్ గార్డుకు చెందిన ఓ జవాను ఆ సొరంగాన్ని కనిపెట్టగలిగాడని ఎస్పీ గౌరవ్ రాయ్ చెప్పారు.
ఈ ప్రాంతంలో ఇప్పటివరకు తాము కనుగొన్న అతిపెద్ద రహస్య స్థావరం ఇదేనని రాయ్ తెలిపారు.  బలగాల తరలింపు సమయంలో మావోయిస్టుల రహస్య స్థావరంగా ఇది ఉండేదని భావిస్తున్నామని ఎస్పీ గౌరవ్ రాయ్ తెలిపారు.  అలాగే, దీన్ని పోలీసు బలగాలపై ఆకస్మికంగా దాడి చేయడానికి, ఇతర అవసరాలకు కూడా వినియోగించుకునే ఉద్దేశంతో నిర్మించి ఉంటారని ఎస్పీ తెలిపారు.
ఆ సొరంగాన్ని పోలీసులు ధ్వంసం చేశారు. 10 అడుగుల లోతులో ఉన్న ఆ టన్నెల్‌లో ఏకకాలంలో 100 మంది వరకు తలదాచుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  అబూజ్ మఢ్ అటవీ ప్రాంతంలోని భైరంగఢ్ పోలీస్ స్టేషన్ కు 12 కిలోమీటర్ల దూరంలో మావోయిస్టులతో ఎదురుకాల్పులు జరిగాయని ఎస్పీ తెలిపారు.
 
దంతెవాడ-బీజాపూర్ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో సీపీఐ (మావోయిస్టు) ఉన్నత స్థాయి డివిజనల్ కమిటీ సభ్యుడు మల్లేష్ తో సహా 25-30 మంది సాయుధ మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందడంతో భద్రతా దళాలను మోహరించారు. తడోపట్ గ్రామ సమీపంలో మావోయిస్టులతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపి వారిని బలవంతంగా అడవుల్లోకి పారిపోయేలా చేశాయి. 
 
తిరిగి వస్తుండగా మావోయిస్టులు నిర్మించిన ఈ సొరంగాన్ని గుర్తించారు. ఈ ఎదురుకాల్పుల్లో కొందరు మావోయిస్టులు మరణించి ఉంటారని, అయితే తమకు ఎలాంటి మృతదేహాలు లభించలేదని దంతెవాడ పోలీసులు తెలిపారు. దంతేవాడ అడవుల్లో గుర్తించిన సొరంగాన్ని జిల్లా పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. 
 
ఆ వీడియోలో మావోయిస్టులు సొరంగంలోని యాక్సెస్ పాయింట్లను మట్టి, కర్రలతో ఎలా కప్పారో చూపించారు. ఇరుకైన సొరంగంలో ప్రతి ఆరు మీటర్లకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇలాంటి రహస్య స్థావరాలు గతంలో అబూజ్ మఢ్ ప్రాంతంలో కనిపించాయని, ప్రధానంగా మావోయిస్టు అగ్రనేతలకు రహస్య స్థావరాలుగా ఉపయోగించేవారని తెలుస్తోంది.
‘‘ఇది సీనియర్ సభ్యులకు స్థావరంగా తయారు చేసిన ఒక రకమైన బంకర్. ఆ బంకర్ లో ఎవరైనా నడవవచ్చు, వెలుతురు వచ్చే వీలు కూడా ఉంది. అది ఎవరో సీనియర్ నాయకుడి కోసం ఏర్పాటు చేసిన సొరంగంగా తెలుస్తోంది. ఈ ప్రాంతంలో చాలా మంది సీనియర్ సభ్యులు ఉన్నారు’’ అని స్పెషల్ డైరెక్టర్ జనరల్ (యాంటీ నక్సల్ ఆపరేషన్స్)గా పనిచేసిన రిటైర్డ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి ఆర్కే విజ్ చెప్పారు. 
 
ఇలాంటి సొరంగాలు, బంకర్లను గతంలో కూడా కనుగొన్నామని విజ్ తెలిపారు. 2012లో బీజాపూర్ లో మావోయిస్టు అగ్రనేత గణపతి ఉపయోగించిన 80 మీటర్ల పొడవైన సొరంగ మార్గాన్ని కనుగొన్నారు. ఆ తర్వాత బీజాపూర్లోని కెర్పర్ ప్రాంతంలో కంప్యూటర్లు, ఇతర సామగ్రిని నిల్వ చేయడానికి ఉపయోగించే సొరంగాన్ని కనుగొన్నాం’ అని విజ్ చెప్పారు.