ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి!

ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి!

ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను టీమిండియా ఓటమితో ప్రారంభించింది. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా 28 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆసాంతం ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ వైఫల్యం భారత్ కొంపముంచింది. గెలుపొందే మ్యాచ్‌లో తడబాటుతో టీమిండియా చేజేతులా మ్యాచ్‌ను చేజార్చుకుంది. అందరూ భారత్ గెలుపు ఖయమనకున్నా తరుణంలో ఇంగ్లండ్ బౌలర్ టామ్ హరల్టీ స్పిన్ ఉచ్చులో చిక్కుకుని 28 పరుగుల తేడాతో ఓటమిని మూడగట్టుకుంది.

బజ్‌బాల్‌ ఆటతో భారత గడ్డపై రాణిస్తామని పర్యటనకు ముందు నుంచీ చెబుతున్న ఇంగ్లాండ్‌ జట్టు ఆ దిశగా తొలి అడుగు వేసింది. స్పిన్‌ పిచ్‌పై భారత జట్టును బోల్తా కొట్టించి విజయం సాధించింది. అరంగేట్ర టెస్టు మ్యాచ్‌లోనే 7 వికెట్లతో సత్తాచాటాడు టామ్‌ హార్ట్లీ. ఈ విజయంతో ఇంగ్లాండ్‌ ఐదు మ్యాచుల టెస్టు సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో 190 రన్స్ భారీ ఆధిక్యం సాధించిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో కుప్పకూలి, పరాజయాన్ని మూటగట్టుకుంది. 

ఓవర్‌నైట్‌ స్కోరు 316/6తో నాలుగో రోజు ఆట కొనసాగించిన పర్యాటక జట్టు మరో 420 పరుగులకు ఆలౌట్‌ అయింది. దీంతో భారత్‌ ముందు 231 పరుగుల లక్ష్యం నిలిచింది. అయితే లక్ష్య ఛేదనలో టీమిండియా బ్యాటర్లు విఫలమయ్యారు. ఇంగ్లాండ్‌ స్పిన్నర్లను ఎదుర్కోలేక పెవిలియన్‌కు క్యూ కట్టారు. ముఖ్యంగా అరంగేట్ర స్పిన్నర్‌ టామ్‌ హార్ట్లీ బౌలింగ్‌ను ఆడేందుకు టీమిండియా బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.

యశస్వి జైశ్వాల్‌ (15) ఫస్ట్‌ వికెట్‌గా వెనుదిరిగాడు. పేలవ ఫామ్‌ను కొనసాగిస్తూ శుభ్‌మన్‌ గిల్‌ పరుగుల ఖాతాను తెరవకుండానే ఔట్‌ అయ్యాడు. అయినా లక్ష్యం చిన్నదే కావడం రోహిత్ శర్మ, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ వంటి బ్యాటర్లు ఉండటంతో టీమిండియా విజయంపై ధీమాగానే ఉంది. కానీ రోహిత్‌ శర్మ (39) ఔట్‌ కావడంతో సీన్‌ రివర్స్‌ అయింది.

బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుకొచ్చిన అక్షర్‌ పటేల్‌ (17) సైతం ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. దీంతో వంద పరుగులలోపే భారత్ 4 వికెట్లు కోల్పోయింది. కేఎల్‌ రాహుల్‌ (22), రవీంద్ర జడేజా (2), శ్రేయస్‌ అయ్యర్‌ (13)లు సైతం త్వరగానే ఔట్‌ కావడంతో ఇంగ్లాండ్‌ శిబిరంలో విజయంపై ఆశలు చిగురించాయి. 119 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన భారత్.. ఓటమి అంచున నిలిచింది. 
 
ఈ దశలో శ్రీకర్‌ భరత్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌లు 57 పరుగులు జోడించి.. లక్ష్యాన్ని కరిగిస్తూ వచ్చారు. దీంతో మ్యాచ్‌ ఉత్కంఠగా మారింది. కానీ శ్రీకర్‌ భరత్‌ (28), రవిచంద్రన్‌ అశ్విన్ (28)లు స్వల్వ వ్యవధిలో ఔట్‌ కావడంతో ఇంగ్లాండ్‌ విజయం ఖాయమైంది. చివరకు భారత్ 202 పరుగులకు ఆలౌట్‌ అయింది.  ఇంగ్లాండ్‌ బౌలర్లలో టామ్‌ హార్ట్లీ 7 వికెట్లతో భారత పతనాన్ని శాసించాడు. జాక్‌ లీచ్‌ 1, జో రూట్ 1 వికెట్‌ తీశారు. తొలి టెస్టు ఫలితంతో టీమిండియా హైదరాబాద్‌లో తొలిసారిగా టెస్టు మ్యాచ్‌ను ఓడిపోయింది. సిరీస్‌లో భాగంగా రెండో టెస్టు ఫిబ్రవరి 2 నుంచి విశాఖ వేదికగా జరగనుంది.