కరోనా కంటే ప్రమాదకర వైరస్‌పై చైనా ప్రయోగాలు

కరోనా కంటే ప్రమాదకర వైరస్‌పై చైనా ప్రయోగాలు
కరోనా సృష్టించిన కల్లోలం నుంచి ప్రపంచం ఇంకా తేరుకోనేలేదు! అసలు కరోనా వైరస్‌ నిజంగానే విపత్తా? చైనా ల్యాబ్‌ల్లో పుట్టిందా? అనే మర్మం ఇంకా వీడనలేదు! అప్పుడే మరో సునామీ లాంటి వార్త వెలుగులోకి వచ్చింది. కరోనా వైరస్‌కు పుట్టినిల్లు అయిన చైనా మరో ప్రమాదకర వైరస్‌పై ప్రయోగాలు చేస్తున్నట్లు మీడియా కథనాలు రావడం ఇప్పుడు సంచలనంగా మారింది. 
చైనా ప్రయోగాలు జరుపుతున్న ఈ వైరస్‌  కరోనా మహమ్మారి కంటే అత్యంత ప్రమాదకరమైన వైరస్‌ అని, ఇది సోకితే నూటికి నూరు శాతం చనిపోవాల్సిందేనని తెలుస్తోంది. వుహాన్‌లో జరిపిన ఓ అధ్యయనంతో ఈ విషయం బయటపడిందని ఆ కథనాలు పేర్కొనడం మరింత ఆందళన కలిగిస్తోంది.

సార్స్‌కోవ్‌-2కు చెందిన సబ్‌ వేరియంట్‌ GX_p2V పై చైనా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నట్లు వుహాన్‌లో నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైనట్లు సదరు అధ్యయనాలు పేర్కొన్నాయి. ఈ సబ్‌ వేరియంట్‌.. 2017లో వెలుగుచూసిన జీఎక్స్‌ మ్యుటేషన్‌గా తెలుస్తోంది. మలేసియన్‌ పాంగోలిన్‌ అనే రకం జంతువుల్లో ఈ మ్యుటేషన్‌ బయటపడింది. 

ఈ ప్రమాదకరమైన వైరస్‌ను ఎలుకలపై ప్రయోగించి బీజింగ్‌ శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపినట్లు కథనాల్లో వెల్లడైంది. GX_p2V మ్యుటేషన్‌ వైరస్‌ను ఎలుకలపై ప్రయోగించగా కేవలం 8 రోజుల్లోనే అవన్నీ మరణించాయని ఆ కథనాల్లో పేర్కొన్నారు.  ‘ఈ వైరస్‌ సోకిన తర్వాత ఎలుకల్లో ఊపిరితిత్తులు, ఎముకలు, కళ్లు, మెదడు చాలా దెబ్బతిన్నాయి. దీని కారణంగా బరువు తగ్గి బలహీనంగా మారాయి. కొన్ని రోజుల్లోనే ఆరోగ్యం పూర్తిగా క్షీణించి నడవలేని స్థితికి చేరుకున్నాయి.’ అని అధ్యయనంలో తెలిపాయి. 

కేవలం 8 రోజుల్లోనే క్షీణించి ప్రాణాలు కోల్పోయాయి అంటే ఈ వైరస్‌ ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవచ్చని స్పష్టం చేశాయి. ఇప్పటివరకు ఎలుకలపైనే ప్రయోగించిన ఈ వైరస్‌ మనుషులపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయంపై స్పష్టత లేదు. కాకపోతే దాదాపు ఎలుకల్లో కనిపించిన లక్షణాలే ఉండొచ్చని పలు విశ్లేషణలు తెలుపుతున్నాయి. 

ఏదేమైనా ఈ వైరస్‌తో మనుషులకు పెనుముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని పలువురు అధ్యయనకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ప్రయోగాలకు కరోనా వైరస్‌ తొలిసారి వెలుగుచూసిన వుహాన్‌ ల్యాబ్‌కు ఎలాంటి సంబంధం లేదని అధ్యయనం తెలిపింది. వుహాన్‌ ల్యాబ్‌ నుంచే కరోనా వైరస్‌ వచ్చిందని ఎప్పట్నుంచో ఆరోపణలు వస్తున్నాయి. 

ప్రపంచ దేశాలు, అంతర్జాతీయ సంస్థలు సైతం ఇదే విషయాన్ని వాదిస్తున్నాయి. కానీ చైనా మాత్రం మొదట్నుంచి ఈ విషయాన్ని గోప్యంగానే ఉంచుతోంది. ఈ క్రమంలో మరో ప్రమాదకరమైన వైరస్‌పై చైనా ప్రయోగాలు జరిపిందనే వార్తలు రావడం ఇప్పుడు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది.