కీచక ప్రొఫెసర్ పై 500 మంది విద్యార్థినులు ప్రధానికి ఫిర్యాదు

ఓ ప్రొఫెసర్‌ తమపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని హర్యానాకు చెందిన దాదాపు 500 మంది విద్యార్థినులు ఆరోపించడం సంచలనంగా మారింది. ఫ్రొఫెసర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ వారు నేరుగా ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయంకె ఫిర్యాదు పత్రం పంపారు. ప్రధానితో పాటు  ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌, గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, మహిళా కమిషన్‌కు కూడా లేఖలు రాశారు. 
 
హర్యానాలోని సిర్సాలో ఉన్న చౌదరి దేవీలాల్‌ యూనివర్సిటీలో ఈ ఘటన చోటుచేసుకుంది. చాంబర్‌లోకి పిలిచి ప్రొఫెసర్‌ తమపై లైంగిక వేధింపులకు పాల్పడేవారని విద్యార్థినులు ఆరోపించారు. వర్సిటీలోని అంతర్గత ఫిర్యాదుల కమిటీకి గతంలో ఫిర్యాదు చేసినప్పటికీ ఆయనకు క్లీనిచిట్‌ ఇచ్చినట్టు వాపోయారు. విద్యార్థులపై ఆరోపణలపై దర్యాప్తునకు పోలీసులు సిట్‌ ఏర్పాటుచేశారు.

ప్రొఫెసర్ తమను లైంగికంగా వేధిస్తున్నాడని, తమను విడి విడిగా తన కార్యాలయంలోని బాత్రూమ్ వద్దకు పిలిచి, తాకరాని చోట్ల తాకుతున్నాడని, తాము వ్యతిరేకిస్తే, తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరిస్తున్నాడని వారు ఆ లేఖలో ఆరోపించారు.  ప్రొఫెసర్ ముందు జాగ్రత్తగా తన గదిలోని సిసి టివి ఫుటేజీతోపాటు ఇతర సాక్ష్యాలను ధ్వంసం చేశాడని వారు ఆరోపించారు.

యూనివర్సిటీ అధికారులపై తమకు నమ్మకం లేదని, రిటైర్డ్ హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని, ప్రొఫెసర్ ను సస్పెండ్ చేయాలని విద్యార్థునులు డిమాండ్ చేస్తున్నారు. ప్రొఫెసర్ పై విద్యార్థినులు ఫిర్యాదు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో మూడుసార్లు వారు ఫిర్యాదు చేశారు. అయితే యూనివర్శిటీ అంతర్గత ఫిర్యాదుల కమిటీ ప్రొఫెసర్ కు క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే విద్యార్థినుల ఆరోపణలను ప్రొఫెసర్ ఖండించారు. 

వారి ఆరోపణల వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేశామని, విచారణకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు పోలీసు అధికారులు చెప్పారు.