ఉల్ఫాతో చ‌రిత్రాత్మ‌క శాంతి ఒప్పందం

ఉల్ఫాతో చ‌రిత్రాత్మ‌క శాంతి ఒప్పందం
యునైటెడ్ లిబ‌రేష‌న్ ఫ్రంట్ ఆఫ్ అసాం (యూఎల్ఎఫ్ఏ)తో శుక్రవారం కేంద్ర ప్ర‌భుత్వం చ‌రిత్రాత్మ‌క ఒప్పందం కుదుర్చుకున్న‌ది. కేంద్రం, అస్సాం ప్ర‌భుత్వం, ఉల్ఫా మ‌ధ్య ఈ ఒప్పందం జ‌రిగింది. ముగ్గురూ శాంతి ఒప్పందంపై సంత‌కాలు చేశారు. దీంతో ఈశాన్య రాష్ట్రాల్లో జ‌రుగుతున్న మార‌ణకాండ‌కు ముగింపు ప‌డే అవ‌కాశాలు ఉన్న‌ట్లు భావిస్తున్నారు.

అస్సాంలో ఉల్ఫా అత్యంత పురాత‌న తిరుగుబాటు ద‌ళంగా కొన‌సాగుతున్న‌ది. అయితే ఆ ద‌ళంతో ఒప్పందం చేసుకోవ‌డాన్ని కొంద‌రు వ్య‌తిరేకిస్తున్నారు. ఈ చ‌ర్చ‌ల‌కు ప‌రేశ్ బారువా నేతృత్వంలోని ఉల్ఫా స్వ‌తంత్య్ర గ్రూపు దూరంగా ఉంది.  అక్ర‌మ వ‌ల‌స‌లు, తెగ‌ల‌కు భూమి హ‌క్కులు, అసాం అభివృద్ధి కోసం ఆర్థిక ప్యాకేజీ లాంటి స‌మ‌స్య‌లు కొలిక్కి వ‌చ్చే అవకాశం ఉంది.

ద‌శ‌ల వారీగా ఉల్ఫా డిమాండ్ల‌ను తీరుస్తామ‌ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు.  ఆఫ్సా లాంటి ప్ర‌త్యేక చ‌ట్టాల‌ను తొల‌గించామ‌ని, దీని ఉద్దేశం అస్సాంలో తిరుగుబాటు త‌గ్గిన‌ట్లే అవుతుంద‌ని షా పేర్కొన్నారు. ఉల్ఫా ప్ర‌తినిధులు, అస్సాం ముఖ్యమంత్రి బిశ్వ‌శ‌ర్మ‌, అమిత్ షా.. సంత‌కాల కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

ఉల్ఫాకు చైర్‌పర్సన్ అరబిందా రాజ్‌ఖోవా నేతృత్వంలోని 16 మంది సభ్యుల ప్రతినిధి బృందం ప్రాతినిధ్యం వహించింది. అస్సాం ప్రజలకు ఇది “బంగారు దినం” అని పేర్కొన్న అమిత్ షా, ఉల్ఫా హింస కారణంగా రాష్ట్రం చాలా కాలంగా నష్టపోయిందని, 1979 నుండి సుమారు 10,000 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు.

ఉల్ఫాతో ఒప్పందం ప్రకారం అస్సాంకు పెద్ద అభివృద్ధి ప్యాకేజీ లభిస్తుందని చెబుతూ ఒప్పందాన్ని పూర్తిగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. “ఈ రోజు అస్సాం భవిష్యత్తుకు బంగారు దినం కావడం నాకు చాలా సంతోషకరమైన విషయం. అస్సాం చాలా కాలంగా హింసకు గురవుతోంది. నరేంద్ర మోదీ ప్రధాని అయినప్పటి నుంచి ఢిల్లీ, ఈశాన్య రాష్ట్రాల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు ప్రయత్నాలు జరిగాయి” అని తెలిపారు.

గత ఐదేళ్లలో, ఈశాన్య అంతటా 9 శాంతి, సరిహద్దు సంబంధిత ఒప్పందాలు కుదిరాయని, దీని కారణంగా ఈ ప్రాంతంలోని ప్రధాన ప్రాంతంలో శాంతి నెలకొందని ఆయన చెప్పారు. హింసకు స్వస్తి పలికి సంస్థను రద్దు చేసేందుకు ఉల్ఫా అంగీకరించిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

ఆల్ఫా అగ్రనేతలు ఇద్దరు గత వారం రోజులుగా దేశ రాజధానిలో వేశారు.  సంస్థ ప్రధాన కార్యదర్శి అనుప్ చెతియా మంగళవారం శాంతి సంభాషణకర్త ఏకే మిశ్రాతో చర్చలు జరిపారు. ఈశాన్య వ్యవహారాలపై ప్రభుత్వ సలహాదారుగా ఉన్న మిశ్రాతో పాటు ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తపన్ దేకా బృందంతో చర్చల్లో భాగమయ్యారు.

 స్వతంత్ర అస్సాం కోసం సాయుధ పోరాటం చేసేందుకు ఎగువ అస్సాం జిల్లాలకు చెందిన 20 మంది యువకుల బృందం 1979లో ఉల్ఫా వేర్పాటువాద సంస్థను స్థాపించింది. దీనిని కేంద్ర ప్రభుత్వం 1990లో నిషేధించింది. ఈ బృందం పలు సందర్భాల్లో చర్చలకు సుముఖత వ్యక్తం చేసినప్పటికీ ‘సార్వభౌమాధికారం’పై తన వైఖరిపై దృఢంగా ఉంది.

ఈ సంవత్సరం ప్రారంభంలో త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారాలలో, 2014లో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఈశాన్య ప్రాంతంలో తీవ్రవాద క్షీణత, సాపేక్ష శాంతి కోసం చేస్తున్న ప్రయత్నాలను బిజెపి ప్రముఖంగా ప్రస్తావించింది.  మైతీ వేర్పాటువాద గ్రూపు అయిన మణిపూర్‌లోని యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ తో గత నెలలోనే అమిత్ షా సమక్షంలో శాంతి ఒప్పందం కుదిరింది. దానితో ఉల్ఫాతో ఒప్పందంకు మార్గం సుగమమైంది.