వచ్చే లోక్‌సభ ఎన్నికలలో దేశ ప్రజలకు బిజెపి సహజ ఎంపిక

వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలలో దేశ ప్రజలకు భారతీయ జనతా పార్టీ సహజ ఎంపిక కానున్నదని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. సంకీర్ణ ప్రభుత్వం దేశానికి అవసరం లేదన్న ఏకాభిప్రాయానికి ప్రజలు వచ్చారని ఆయన స్పష్టం చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి హ్యాట్రిక్ విజయాన్ని సాధించ

నున్నదని ఆత్మవిశ్వాసంతో చెబుతున్న మాటలు కావని, సంకీర్ణ ప్రభుత్వాల హయాంలో పాలన కొరవడిందన్న వాస్తవాన్ని ప్రజలు ప్రత్యక్షంగా చూశారని `ఇండియా టుడే’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో మోదీ భరోసా వ్యక్తం చేశారు. మన దేశానికి సంకీర్ణ ప్రభుత్వం అవసరం లేదని ప్రజలు, నిపుణులు, మేధావులు, మీడియాలోని మిత్రులలో సైతం ఏకాభిప్రాయం ఏర్పడిందని ఆయన చెప్పారు. 

సంకీర్ణ ప్రభుత్వాల ఫలితంగా ఏర్పడిన అస్థిరతతో దేశం 30 ఏళ్లు కోల్పోయిందని ఆయన తెలిపారు. పాలనారాహిత్యం, బుజ్జగింపు రాజకీయాలు, అవినీతి వంటివన్నీ సంకీర్ణ ప్రభుత్వాల హయాంలో దేశ ప్రజలు చూశారని ఆయన చెప్పారు.  గతంలో ప్రజలలో విశ్వాసాన్ని, ఆశావాదాన్ని కోల్పోయిన ఈ సంకీర్ణ ప్రభుత్వాల కారణంగానే 2024లో ప్రజలకు బిజెపి సహజ ఎంపిక కానున్నదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

దేశ ప్రజల సేవలో తన సర్వస్వాన్ని అర్పించడం ఒక్కటే తనకు తెలుసునని ఆయన పేర్కొన్నారు. బిజెపిని పాన్ ఇండియా (దేశవ్యాప్త) పార్టీ కాదని చిత్రీకరించడం సబబుకాదని ప్రధాని మోదీ చెప్పారు. లోక్‌సభ సీట్లను పరిగణనలోకి తీసుకుంటే దక్షిణ భారతంలో బిజెపి ఏకైక అతిపెద్ద పార్టీగా ఆయన పేర్కొన్నారు. లోక్‌సభలోని మొత్తం 545 సీట్లలో ప్రస్తుతం బిజెపికి 303 మంది సభ్యులున్నారు. 

అయితే కర్నాటక అసెంబీ ఎన్నికల తర్వాత ఆ పార్టీ ఐదు దక్షిణాది రాష్ట్రాలలో ఎక్కడా అధికారంలో లేదు. `మా పార్టీకి బలం లేని ప్రాంతమంటూ ఇప్పుడు ఈ దేశంలో ఎక్కడా లేదు. కేరళలో స్థానిక సంస్థల నుంచి అనేక రాష్ట్రాలలో ప్రధాన ప్రతిపక్షంగా మా పార్టీ ఉంది. ప్రజలతో మమేకమవుతూ మా పార్టీ నాయకులు విశేషంగా పనిచేస్తున్నారు’ అని ప్రధాని తెలిపారు. 

`ఆరు నెలల క్రితం వరకు కర్ణాటకలో మా ప్రభుత్వం ఉంది. ఈనాటికి కూడా పుదుచ్చేరిలో మా ప్రభుత్వమే ఉంది. ప్రస్తుతం 16 రాష్ట్రాలలో మా పార్టీ అధికారంలో ఉండగా 8 రాష్ట్రాలలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంది’ అని మోదీ వివరించారు.

బిజెపిని బ్రాహ్మణ-వైశ్య పార్టీగా, హిందీ రాష్ట్రాలకు పరిమితమైన పార్టీగా కొందరు విమర్శకులు వేస్తున్న ముద్రలను ఆయన కొట్టివేశారు. ప్రతి ఎన్నికలలోనూ ఈ ముద్రలు అబద్ధాలని నిరూపితమవుతోందని మోదీ చెప్పారు. క్రైస్తవ జనాభా అధికంగా ఉన్న రాష్ట్రాలతోసహా ఈశాన్య రాష్ట్రాలలో సైతం బిజెపి జెండా ఎగరవేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

2014లో ఉనికే లేని తాము ఆరు ఈశాన్య రాష్ట్రాలలో అధికారంలో ఉన్నామని, అందులో క్రైస్తవ జనాభా అధికంగా ఉండే నాగాలాండ్, మేఘాలయ కూడా ఉన్నాయని ఆయన తెలిపారు. 1984లో కేవలం రెండు లోక్‌సభ స్థానాలతో ప్రారంభమైన తమ ప్రస్థానం నేడు 303 స్థానాలకు చేరుకుందని గుర్తు చేశారు. దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన ప్రజల మద్దతు లేకుండా జాతీయ రాజకీయాలలో ఇంత బలమైన శక్తిగా ఎదగడం ఎలా సాధ్యపడుతుందని మోదీ  ప్రశ్నించారు.