ఎట్టకేలకు ఫ్రాన్స్‌ నుంచి ముంబై చేరిన భారతీయుల విమానం

మానవ అక్రమ రవాణ ఆరోపణలతో ఫ్రాన్స్‌లో నిర్బంధానికి గురైన రొమేనియన్‌ విమానం ఎట్టకేలకు ముంబై చేరింది. 303 మంది భారతీయులతో దుబాయ్‌ నుంచి నికరాగువా వెళ్తున్న లెజెండ్‌ ఎయిలైన్స్‌ విమానం ఈ నెల 22న ఇంధనం కోసం ఫ్రాన్స్‌లోని వాట్రీ విమానాశ్రయంలో దిగింది.  విమానంలో మానవ అక్రమ రవాణా జరుగుతున్నదనే అనుమానంతో అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
అయితే భారత రాయబార కార్యాలయం జోక్యంతో సమస్య పరిష్కారం అయింది. దీంతో నాలుగు రోజుల నిర్బంధం తర్వాత మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు ముంబైలోని విమానాశ్రయంలో ల్యాండ్‌ అయింది. అందులో 276 మంది భారతీయులు ఉన్నారు.  కొంతమంది ప్రయాణికులు భారత్‌కు తిరిగి రావడానికి ఇష్టపడకపోవడంతో విమానం ఆలస్యంగా బయలుదేరిందని అధికారులు తెలిపారు.
ఇద్దరు మైనర్లతో సహా 25 మంది ప్రయాణికులు ఫ్రాన్స్‌లో ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. భారతీయ ప్రయాణీకులు సెంట్రల్ అమెరికాకు చేరుకోవడానికి ఈ యాత్రను ప్లాన్ చేసి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. అక్రమ ఇమ్మిగ్రేషన్ రింగ్‌లో పాత్ర పోషించారనే అనుమానంతో ఇద్దరు వ్యక్తులను శుక్రవారం ఫ్రెంచ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాగా అక్రమ రవాణాలో తమకు ఎలాంటి ప్రమేయం లేదని విమానయాన సంస్థ స్పష్టం చేసింది.
 
రొమానియన్‌ కంపెనీ లెజెండ్‌ ఎయిర్‌లైన్స్‌ నిర్వహిస్తున్న ఏ340 విమానం 303 మంది భారతీయ ప్రయాణికులతో గురువారం దుబాయ్‌ నుంచి నికరాగువాకు బయలుదేరింది. ఈ క్రమంలో ప్యారిస్‌కు తూర్పున 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫ్రాన్స్‌లోని వాట్రీ విమానాశ్రయంలో ఇంధనం నింపుకునేందుకు విమానం ల్యాండ్‌ అయ్యింది. 
 
అయితే, ‘మానవ అక్రమ రవాణా’ జరుగుతోందన్న గుర్తుతెలియని వ్యక్తుల నుంచి అందిన సమాచారంతో విమానాన్ని ఫ్రాన్స్‌ అధికారులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఈ క్రమంలో విమానంలోని ప్రయాణికులను రెండు రోజుల పాటు ఎయిర్‌పోర్టులోనే అధికారులు ప్రశ్నించారు.  విచారణ అనంతరం తాజాగా విమాన ప్రయాణానికి పూర్తి అనుమతులు జారీ చేసినట్లు సంబంధిత అధికారులు వెల్లడించినట్లు వార్తా సంస్థ పీటీఐ నివేదించింది. ప్రయాణికుల్లో 11 మంది చిన్నారులు ఒంటరిగా ప్రయాణిస్తున్నట్టు గుర్తించారు.