ధోని ప‌రువు న‌ష్టం కేసులో ఐపిఎస్ కు 15 రోజులు జైలు

భారత మాజీ క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వేసిన పరువు నష్టం కేసు విచారణ సందర్భంగా న్యాయస్థానాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓ ఐపీఎస్  అధికారికి 15 రోజుల జైలు శిక్షను విధించింది మద్రాస్ హైకోర్టు. సంపత్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని నిర్ధరిస్తూ జస్టిస్ ఎస్ఎస్ సుందర్, జస్టిస్ సుందర్ మోహన్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 

అయితే ఈ శిక్షను న్యాయస్థానంలో సవాల్ చేసుకునేందుకు వీలుగా 30 రోజుల వరకు అమలును నిలుపుదల చేస్తూ అదేశాలు జారీ చేసింది మద్రాస్ హైకోర్టు. వివ‌రాల‌లోకి వెళితే 2013లో ఐపీఎస్ అధికారి సంపత్ కుమార్ జీ టీవీ ఛానల్లో మాట్లాడుతూ ఐపీఎల్ ఫిక్సింగ్కు, క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీకి ముడిపెడుతూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. 

దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ధోనీ సంబంధిత టీవీ ఛానల్తో పాటు అధికారి సంపత్పై 2014లో పరువు నష్టం దావా వేశారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని, పరిహారంగా రూ.100 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. 17 ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటూ కోర్టును ఆశ్రయించారు.

ధోనీ పిటిషన్పై స్పందించిన హైకోర్టు ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటూ జీ టీవీ యాజమాన్యానికి, సంపత్కు నోటీసులు జారీ చేసింది. ధోనీ నోటీసులపై జీ మీడియా ఇచ్చిన వివరణ కోర్టు కొట్టివేసింది. ధోనీ లాంటి అంతర్జాతీయ క్రికెటర్పై వార్తలు ప్రచురించే ముందు జాగ్రత్తగా ఉండాలని విచారణ సందర్భంగా కోర్టు సూచించింది. 
మరోవైపు ఐపీఎస్ అధికారి సంపత్ కుమార్ ఇచ్చిన వివరణపై ధోనీ సంతృప్తి చెందలేదు. ఆయన ఇచ్చిన వివరణలో సుప్రీం కోర్టు, హైకోర్టుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, కోర్టు ధిక్కరణ కింద వెంటనే సంపత్పై చర్యలు తీసుకోవాలని మద్రాస్ హైకోర్టును ధోనీ కోరారు. ఈ పిటిషన్ను విచారించిన న్యాయస్థానం సంపత్కు 15 రోజులు జైలు శిక్షను విధించింది. అయితే శిక్ష అమలును నెల రోజులు వాయిదా వేసింది.