కేరళలో మరోసారి కరోనా మహమ్మారి.. ఇద్దరు మృతి

కేరళ రాష్ట్రంలో మరోసారి కరోనా వైరస్ మహమ్మారి విస్తరిస్తోంది. కనుమరుగైందని అనుకుంటున్న తరుణంలో కరోనా వైరస్ కేసులు కేరళలో రాష్ట్రంలో పెరుగుతుండటంతో ఆందోళన కలిగిస్తోంది. కేరళలో ఒక్కసారిగా 19 కరోనా కేసులు పెరిగాయి. అంతేగాక, కరోనా కారణంగా రెండు మరణాలు కూడా సంభవించాయి.
అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో నవంబర్ నెలలో 470 కేసులు ఉండగా, డిసెంబర్ మొదటి పది రోజుల్లోనే 825 కొత్త కేసులు నమోదు కావడం గమనార్హం. భారతదేశంలో అత్యధికంగా కరోనా కేసులు కేరళ రాష్ట్రంలోనే నమోదయ్యాయి. శ్వాస సంబంధిత లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన రోగులలో కరోనా కేసులు కనుగొన్నట్లు వైద్యాధికారులు తెలిపారు.

 
ఒమిక్రాన్ జేఎన్1 సబ్ వేరియంట్‌ని దక్షిణాది రాష్ట్రం గుర్తించినట్లు నివేదికలు ఉన్నప్పటికీ వైరస్ పై నిరంతర పర్యవేక్షణ అవసరమని అధికారులు స్పష్టం చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లో కేరళ ప్రభుత్వం ఆంక్షలు, నివారణ చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. 
 
ఇండియన్ సార్స్-కోవ్-2 జెనోమిక్స్ కన్సార్టియం లేదా ఇన్సాకోగ్ నుంచి వచ్చిన జేఎన్.1 వేరియంట్ ఉనికిని కేరళలో నిర్ధారించింది తాజా డేటా. ప్రస్తుతం సింగపూర్, ఇండోనేషియా వంటి ఆగ్నేయాసియా దేశాల్లో ఈ తరహా కరోనా వేరియంట్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. మొదట లక్సెంబర్గ్‌లో ఆగస్టు నెలలో మొదట ఈ వేరియంట్ ను గుర్తించారు.
 
పిరోలా వేరియంట్ అని కూడా పిలువబడే బీఏ.2.86 ను ఈ ఏడాది జులైలో డెన్మార్క్ దేశంలో మొదటిసారి కొనుగొన్నారు. కాగా, భారతదేశంలో కరోనా వ్యాప్తి పూర్తిగా నియంత్రణలోనే ఉంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంఖాల ప్రకారం శుక్రవవారం దేశంలో 237 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 
 
దీంతో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1296కి పెరిగింది. మరణాల సంఖ్య 5,33,310గా ఉంది. మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4,50,03,830గా ఉంది. వ్యాధి నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,44,69,536కు పెరిగింది. రికవరీ రేటు 98.81 శాతంగా ఉంది. కరోనా కేసులు పెరుగుతున్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది.