ఈ నేపథ్యంలో లిసిప్రియ శిలాజ ఇంధనాలపై తన వ్యతిరేకతను స్పష్టంచేస్తూ నినాదాలు చేయడంతో కొంత సమయం అక్కడ గందరగోళం నెలకొంది. ఒక్కసారిగా వేదికపైకి దూసుకొచ్చిన లిసిప్రియ ప్రభుత్వాలన్నీ కలిసికట్టుగా శిలాజ ఇంధనాల వాడకాన్ని వెంటనే తగ్గించాలని నినదించింది. కొద్దిసేపటి తర్వాత నిర్వాహకులు సర్దిచెప్పి ఆమెను కిందకు పంపించే ప్రయత్నం చేశారు.
కానీ వారి మాటను లెక్కచేయకుండా వేదికపై అటూ ఇటూ తిరుగుతూ తన ప్రసంగాన్ని కొనసాగించింది. ఆ చిన్నారి ప్రసంగం అందర్నీ ఆకట్టుకుంది. ఆలోచింపజేసే ఆ ప్రసంగానికి వీక్షకుల అభినందనలు దక్కాయి. తాను చెప్పాలనుకున్న విషయాన్ని స్పష్టంగా అందరికీ వివరించింది. ఇంతలో ఇద్దరు భద్రతా సిబ్బంది లిసిప్రియను వేదిక పైనుంచి పక్కకు తీసుకెళ్లారు.
అయితే సమావేశంలో ఉన్న వివిధ దేశాల సభ్యులు మాత్రం లిసిప్రియ చర్యను సమర్థిస్తూ చప్పట్లతో అభినందించారు. ఈ కాలపు యువత ఆశయాలకు లిసిప్రియ నిదర్శనమని కొనియాడారు. ఈ సంఘటనపై కాప్ 28 డైరెక్టర్ జనరల్ అంబాసిడర్ మజిద్ అల్ సువైదీ స్పందిస్తూ.. ఆ చిన్నారి ఉత్సాహాన్ని చూసి తాను ఆశ్చర్యపోయానని తెలిపారు.
నిరసన అనంతరం లిసిప్రియ ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేసింది. ‘నేను నిరసన తెలపడంతో నన్ను 30 నిమిషాల పాటు అదుపులోకి తీసుకున్నారు.. పర్యావరణానికి సంక్షోభానికి కారణమైన శిలాజ ఇంధనాలను వాడొద్దని చెప్పడమే నేను చేసిన నేరం.. అందుకే నన్ను కాప్-28 నుంచి గెంటేశారు’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది.
‘శిలాజ ఇంధనాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపినందుకు నా బ్యాడ్జ్ను నిలిపివేయడానికి కారణం ఏమిటి? మీరు నిజంగా ఆ ఇంధనాలను వ్యతిరేకించేవాళ్లైతే నాకు మద్దతుగా నిలవండి.. నిబంధలకు విరుద్ధంగా ఐరాస ప్రాంగణంలోనే బాలల హక్కుల ఉల్లంఘన జరిగింది.. ఐరాస వేదికపై నా గళాన్ని వినిపించే హక్కు ఉంది’ అని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్, క్లైమేట్ ఛేంజ్ ఎగ్జిక్యూటివ్ సెక్రెటరీ సిమోన్ స్టెల్లను ట్యాగ్ చేసింది.
నవంబర్ 30 నుంచి డిసెంబరు 12 వరకూ జరిగే కాప్ 28 సదస్సుకు 190 దేశాల నుంచి 60 వేల మంది ప్రతినిధులు పాల్గొన్నారు. మణిపూర్ చిన్నారి లిసిప్రియా తూర్పు తైమూర్ ప్రత్యేక రాయబారిగా సదస్సుకు హాజరైంది.
చిన్నవయసు నుంచే వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ వంటి అంశాలపై ఉద్యమిస్తోంది. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ఉపన్యాసాలిచ్చింది. ‘క్లైమేట్ ఛేంజ్ లా’ తీసుకురావాలంటూ భారత పార్లమెంటు ఎదుట ప్లకార్డులు ప్రదర్శించి గళం వినిపించింది. అంతేకాదు, ‘వరల్డ్ చిల్డ్రన్ పీస్ ప్రైజ్ 2019కు ఎంపికయ్యింది.
More Stories
వడ్డీ రేట్లను భారీగా పెంచిన స్టేట్ బ్యాంకు
చాబహార్ పోర్టుపై చిన్న చూపు తగదు .. అమెరికాకు హితవు
ఏపీలో పోలింగ్ ముగిసినా పలుచోట్ల హింసాత్మక ఘటనలు