పాక్ ఆర్మీ బేస్‌పై ఆత్మాహుతి దాడి.. 23 మంది మృతి

పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఆర్మీయే లక్ష్యంగా ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సుమారు 23 మంది ప్రాణాలు కోల్పోయారు. వాయువ్య పాకిస్తాన్ లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్ లోని డేరా ఇస్మాయిల్ ఖాన్ పట్టణంలోని ఆర్మీ బేస్‌పై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. 

ఈ పట్టణం అఫ్ఘానిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉంటుంది. మంగళవారం తెల్లవారుజామున ఉగ్రవాదులు పేలుడు పదార్దాలతో నిండిన వాహనంతో ఆర్మీ బేస్‌ లోకి దూసుకెళ్లి, అక్కడ ఆ వాహనాన్ని పేల్చేశారు. అనంతరం, పోలీస్ స్టేషన్ లోని సిబ్బందిపై కాల్పులు ప్రారంభించారు. ఈ ఆత్మాహుతి దాడిలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 32 మంది తీవ్రంగా గాయపడ్డారు. 

మరణించిన వారిలో చాలా మంది సివిల్ డ్రెస్ లో ఉండడంతో వారు ఎవరనే విషయం ప్రశ్నార్థకంగా మారింది. వారు పాకిస్తాన్ మిలటరీ సిబ్బంది అని స్థానిక మీడియా వెల్లడించింది. ఈ దాడిలో పోలీస్ స్టేషన్ భవనం పూర్తిగా ధ్వంసమైంది. దాడి అనంతరం పోలీస్ స్టేషన్ లోని సిబ్బందిపై ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. 

అయితే, వెంటనే తేరుకున్న పోలీసులు వారిపై ఎదురు కాల్పులు ప్రారంభించారు. ఈ ఎన్ కౌంటర్ కొన్ని గంటల పాటు కొనసాగింది. పోలీసుల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మరికొందరు తప్పించుకుని పారిపోయారు. వారికోసం పోలీసులు సమీప ప్రాంతాల్లో గాలింపు ప్రారంభించారు.

ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్ లోని డేరా ఇస్మాయిల్ ఖాన్ పట్టణం ఉగ్రవాదులకు కంచుకోటగా కొనసాగుతోంది. ఇది అఫ్గానిస్తాన్ కు సమీపంలో ఉండడం వారికి కలిసి వస్తోంది. గతంలో ఇక్కడ ఉగ్రవాద సంస్థ ‘‘తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్తాన్’’ బలంగా ఉండేది. ఇటీవల ఇక్కడ ‘‘తెహ్రీక్ ఇ జహీద్ పాకిస్తాన్’’ పేరుతో మరో ఉగ్రవాద సంస్థ ప్రారంభమైంది.

ఆత్మాహుతి బాంబర్లు సెక్యూరిటీ కాంపౌండ్‌లోకి చొరబడి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఆఫ్ఘానిస్థాన్‌ సరిహద్దులోని గిరిజన ప్రాంతాలకు సమీపంలో జరిగిన ఈ దాడికి తామే బాధ్యులమని పాకిస్థాన్‌కు చెందిన తెహ్రీక్-ఏ-జిహాద్ పాకిస్థాన్ (టీజేపీ) ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఆ పోలీస్ స్టేషన్ లోని అధికారులు లక్ష్యంగా ఈ దాడి చేశామని ప్రకటించింది. ఈ జనవరి నెలలో ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్ లోని ఒక మసీదులో జరిగిన ఒక ఉగ్రదాడిలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.