బిల్లులను పరిశీలించకుండా ఆమోదం తెలపడానికి తానేమీ ‘రబ్బర్స్టాంప్’కానీ, ఎస్ చెప్పే మనిషిని కానీ కాదని కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ స్పష్టం చేశారు. ఏదయినా బిల్లు లేదా, ఆర్డినెన్స్ తన ముందుకు వచ్చినప్పుడు అది రాజ్యాంగరీత్యా, చట్టపరంగా కరెక్టా కాదనే విషయాన్ని తాను పరిశీలిస్తానని ఆయన తేల్చి చెప్పారు.
ప్రభుత్వ బిల్లులను ఆమోదించడంలో విపరీతమైన జాప్యం జరుగుతుందంటూ కేరళ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం రెండేళ్లుగా బిల్లులను ఆమోదించాక ఉంచడం పట్ల గవర్నర్ ను మందలించినట్లు వచ్చిన నేపథ్యంలో ఆయన వాఖ్యలు ప్రాధాన్యత సంతరింప చేసుకున్నాయి. బిల్లులపై గవర్నర్కు వీటో అధికారం లేదని, ఎలాంటి చర్యలు తీసుకోకుండా బిల్లును పెండింగ్లో ఉంచేందుకు ఎలాంటి స్వేచ్ఛ ఉండదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
అయితే సుప్రీంకోర్టు చేసింది కేవలం వ్యాఖ్య మాత్రమేనని కూడా ఆరిఫ్ ఖాన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేరళ ప్రజల సంక్షేమానికి సంబంధించిన ఏ బిల్లు లేదా ఆర్డినెన్స్ తన టేబుల్పైన గంటకూడా ఉండదని ఈ సందర్భంగా గవర్నర్ ఖాన్ తెలిపారు.
‘అలాంటి వాటిని వెంటనే సంతకం చేసి పంపిస్తాను. అయితే ప్రభుత్వం వ్యవస్థలను, యూనివర్శిటీలను, వాటి స్వయంప్రతిపత్తిని నాశనం చేయడానికి తన అధికారాన్ని ఉపయోగించినప్పుడు, అవి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు నేను తలూపే మనిషిగా ఉంటానని వాళ్లు అనుకోకూడదు. ఎందుకంటే నేను రబ్బరు స్టాంప్ కాదు’ అని ఆరిఫ్ ఖాన్ తీవ్రంగా వ్యాఖ్యానించారు.
ఏడు బిల్లులను రాష్ట్రపతి అనుమతి కోసం ఆపి ఉంచడం గురించి అడగ్గా, మంత్రులు వచ్చి ఈ చట్టాల్లోని వివరాలను తెలియజేయడం కోసం తాను రెండు సంవత్సరాలు వేచి చూశానని ఆయన చెప్పారు. అంతేకాకుండా వాటిలో నాలుగు బిల్లులు మనీ బిల్లులని, వాటిని సభలో ప్రవేశపెట్టడానికి ముందు గవర్నర్ అనుమతి తీసుకోవలసిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. మిగతా మూడు బిల్లులు యుజిసి నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ ఆయన తన చర్యను సమర్థించుకున్నారు.
More Stories
స్వాతి మలివాల్పై దాడి గురించి కేజ్రీవాల్ దాటవేత
2029 వరకు ప్రధానిగా నరేంద్ర మోదీ
సీఏఏ కింద తొలిసారి 14 మందికి భారత పౌరసత్వ సర్టిఫికెట్లు