సాగర్ వద్ద తెలుగు రాష్ట్రాల పోలీసుల ఘర్షణతో ఉద్రిక్తత

తెలంగాణాలో అసెంబ్లీ  ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సమయంలో సెంటిమెంట్ ను రెచ్చగొట్టి ప్రయోజనం పొందే ప్రయత్నం అధికార పక్షం బిఆర్ఎస్ నాయకులు, పొరుగు రాష్ట్రం ఏపీలోని మిత్రపక్షమైన వైసిపి నేతల అండదండలతో చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అకస్మాత్తుగా బుధవారం అర్ధరాత్రి నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ పై రెండు రాష్ట్రాల పోలీసుల మధ్య ఉద్రిక్తత నెలకుంది.

బుధవారం సాయంత్రం నుంచి గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లాలో భారీగా 700 మంది ఏపిఎస్పీ పోలీసులు మొహరించారు. అర్థరాత్రి సమయంలో సాగర్ డ్యామ్‌ వెళ్లిన ఏపీ పోలీసులు 13వ నంబర్ గేటు వద్ద ముళ్ల కంచెను ఏర్పాటు చేశారు. వారిని అడ్డుకునేందుకు తెలంగాణ పోలీసులు ప్రయత్నించారు.

ఈ ఏడాది కృష్ణా పరివాహక ప్రాంతంలో వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉండటంతో ఈ ఏడాది కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టుల్లో తీవ్రమైన నీటి ఎద్దడి ఉంది. మరోవైపు డ్యామ్‌ ఆపరేషన్ బాధ్యత మొత్తం తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలో ఉండటంతో ఏపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సాగు, తాగు నీటికి కృష్ణా డెల్టాలో రైతులు ఇబ్బంది పడుతున్నారు.

పల్నాడు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో సాగు, తాగు నీరు అందడం లేదని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. తాగు, సాగు నీరు అందక గుంటూరు, పల్నాడు రైతాంగం కొద్ది రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తోంది. నీటి విడుదలపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చర్చలు జరిగినా అవి కొలిక్కి రాలేదు.

ఈ పరిణామాల నేపథ్యంలో సాగర్‌ నీటిని విడుదల చేసే ఉద్దేశంతో ఏపీ పోలీసులు డ్యామ్‌పైకి చేరినట్టు చెబుతున్నారు. అర్థరాత్రి సమయంలో డ్యామ్‌పై విద్యుత్‌ సరఫరా నిలిపివేసి, అక్కడి సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. నాగార్జునసాగర్‌ డ్యామ్‌ 13వ నంబర్‌ గేట్‌ వరకు దూసుకెళ్లారు. ప్రాజెక్టు మీదకు చేరేందుకు ప్రయత్నించిన పోలీసులను తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. 

ఈ క్రమంలో ఇరు రాష్ట్రాల పోలీసుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఘటనాస్థలానికి చేరుకున్న మీడియా ప్రతినిధులపై పల్నాడు ఎస్పీ రవిశంకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా ప్రతినిధుల ఫోన్లను ఏపీ పోలీసులు లాక్కున్నారు. అడ్డుకున్న డ్యామ్‌ ఎస్పీఎఫ్‌ సిబ్బందిపై దాడి చేసి మొబైల్‌ ఫోన్లను లాక్కున్నారు. డ్యామ్‌ భద్రత కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. 

అనంతరం వారు 13వ గేట్‌ వద్దకు చేరుకొని ముళ్ల కంచెను ఏర్పాటు చేసి డ్యామ్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.  గురువారం ఉదయం, ఆంధ్రప్రదేశ్ తాగునీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ నీటిని విడుదల చేయనున్నట్లు ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రకటించారు.