
దేశంలో అలజడి సృష్టిస్తున్న డీప్ ఫేక్ వీడియోల కట్టడికి డీప్ఫేక్ వీడియోలను సృష్టించే వారికి, ఆ వీడియోల వ్యాప్తికి కారణమయ్యే సామాజిక మాధ్యమాలకు భారీ జరిమానా విధించే యోచనలో ఉన్నట్లు కేంద్ర ఐటి శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. డీప్ ఫేక్ వీడియోల కట్టడిపై చర్చించేందుకు కేంద్రం గురువారం కీలక సమావేశం నిర్వహించింది.
సామాజిక మాధ్యమ సంస్థలు, నాస్కామ్, కృత్రిమ మేధ (ఎఐ)పై పని చేసే నిపుణులతో చర్చించింది. ఈ సమావేశం అనంతరం కేంద్ర ఐటి శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ మన ప్రజాస్వామ్యానికి డీప్ ఫేక్ పెను ముప్పుగా పరిణమించిందని ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని కట్టడి చేసేందుకు తక్షణమే చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
‘సామాజిక మాధ్యమ సంస్థలతో సమావేశంలో మేము నాలుగు అంశాలపై కీలకంగా చర్చించాం. డీప్ఫేక్లను గుర్తించడం, వాటి అరికట్టడం, వాటిని నివేదించడం, అవగాహన కల్పించడం వంటి అంశాలపై చర్చించాం. రాబోయే కొద్ది వారాల్లో దీనికి సంబంధించిన కొత్త నిబంధనలను తీసుకు రానున్నాం. ఆ ముసాయిదా రూపకల్పన నేటి నుంచే ప్రారంభిస్తున్నాం’ అని కేంద్ర మంత్రి తెలిపారు.
ఇప్పటికే అమలులో ఉన్న కొన్ని నిబంధనలను సవరించడమో లేక కొత్త చట్టాన్ని తీసుకు రావడమో చేస్తామని ఆయన తెలిపారు. డిసెంబర్ వారంలో దీనిపై మరోసారి చర్చిస్తామని చెప్పారు. ఇటీవల సినీతారలు రష్మిక, కాజోల్, కత్రినా కైఫ్, సచిన్ తెండూల్కర్ కుమార్తె సారా సహా పలువురు సెలబ్రిటీల డీప్ఫేక్ వీడియోలు వైరల్ అయిన విషయం తెలిసిందే.
దీంతో టెక్నాలజీ దుర్వినియోగంపై పలువురు ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా దీనిపై తీవ్రంగా స్పందించారు. డీప్ఫేక్లు సమస్యాత్మకంగా మారుతున్నాయని పేర్కొంటూ దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని మీడియాను కోరారు. ఈ నేపథ్యంలోనే దీనిపై చర్యలకు సిద్ధమయిన కేంద్రం సామాజిక మాధ్యమ సంస్థలతో సమావేశమై చర్చించింది.
More Stories
రైతులకు మరో రెండు పథకాలు ప్రారంభించిన ప్రధాని మోదీ
చొరబాట్లేతోనే ముస్లిం జనాభా అసాధారణంగా పెరుగుదల
మహిళా జర్నలిస్టులు లేకుండా ఆఫ్ఘన్ మీడియా సమావేశం