పాక్ లో మరో జైషే మహ్మద్ ఉగ్రవాది హతం

మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది, జైషే మహ్మద్ సభ్యుడు తాజ్ మహమ్మద్ హతమయ్యాడు. పాకిస్థాన్‌లో గుర్తు తెలియని వ్యక్తులు అతడిని కాల్చి చంపినట్టు తెలుస్తోంది. అనేక హింసాత్మక ఉగ్రవాద ఘటనలతో సంబంధమున్న మోస్ట్ వాంటెడ్ జైష్-ఇ-మహ్మద్ ఉగ్రవాది అబ్దుల్ రవూఫ్‌ అస్గర్‌కు తాజ్‌ మహ్మద్‌ రైట్‌ హ్యండ్‌, సమీపబంధువు. 

ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.  కాగా, జైషే ముఠాలో అత్యంత కీలకమైన ఉగ్రవాది అబ్దుల్ రవూఫ్‌ అస్గర్. ముఖ్యంగా ఇండియాలో పఠాన్‌కోట్, నగ్రోటా, యూరీ, పుల్వామా వంటి ఉగ్ర దాడుల్లో అతినిదే కీలక పాత్ర. 1999లో అఫ్గానిస్థాన్‌లోని కాందహార్‌లో భారత విమానాన్ని హైజాక్‌ చేసిన ఘటనలో రవూఫ్‌ ప్రధాన సూత్రధారి.

అంతేగాక, 2001లో భారత పార్లమెంట్‌పై ఉగ్రదాడి, 2016లో పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో భారత వాయుసేన స్థావరంపై దాడి, అలాగే 2014-2019 మధ్య భద్రతా సిబ్బందిపై జరిగిన అనేక దాడుల్లో సూత్రధారిగా ఆరోపణలున్నాయి. 2 019లో పుల్వామా ఉగ్రదాడిలో 42 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన ఘటనలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఛార్జిషీట్‌లో రౌఫ్ అస్గర్, మసూద్ అజర్ పేర్లు ఉన్నాయి.

ఖలిస్తానీ ఉగ్రవాదిపై ఎన్‌ఐఏ కేసు

మరోవంక, ఎయిర్‌ ఇండియాను బెదిరిస్తూ ఇటీవల వీడియో విడుదల చేసిన ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సోమవారం కేసు నమోదు చేసింది. పలు సెక్షన్ల కింద అతడిపై కేసు నమోదు చేసినట్లు ఆ సంస్థ పేర్కొంది. సిక్స్‌ ఫర్ జస్టిస్ (ఎస్‌ఎఫ్‌జే) చీఫ్‌ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ నవంబర్ 4న ఒక బెదిరింపు వీడియో విడుదల చేశాడు. నవంబర్‌ 19న ఎయిర్‌ ఇండియా విమానాల్లో సిక్కులు ప్రయాణించవద్దని, వారి ప్రాణాలకు ప్రమాదం ఉందని అందులో హెచ్చరించాడు.

కాగా, ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పేరు మారుతుందని, నవంబర్ 19 న ఆ ఎయిర్‌పోర్ట్‌ను మూసివేస్తారని కెనడాలో ఉంటున్న ఖలిస్తానీ ఉగ్రవాది పన్నూన్‌ పేర్కొన్నాడు. అలాగే నవంబర్‌ 19న వరల్డ్‌ క్రికెట్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ను పోలుస్తూ వరల్డ్‌ టెర్రర్‌ కప్‌ మాదిరిగా ఆ రోజు ఉంటుందని ఆ వీడియోలో బెదిరించాడు. ఈ నేపథ్యంలో ఆదివారం అన్ని చోట్ల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు