రష్మిక ఫేక్ వీడియోపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం

టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియోపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సీరియస్‌గా స్పందించారు. తప్పుడు సమాచారానికి సంబంధించి ప్రస్తుతం డీప్ ఫేక్స్ అత్యంత ప్రమాదకరమైనవిగా, హానికరమైనవిగానూ పరిణమిస్తున్నాయంటూ సోమవారం ట్వీట్ చేశారు. ఇలాంటి తప్పుడు వీడియోలు పోస్ట్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

అంతేకాదు ట్విటర్ వేదికగా ఐటీ చట్టంలోని పలు నిబంధనల ప్రకారం సోషల్ మీడియా ప్లాట్‌పాంలకు కూడా కొన్ని సూచనలు అందించారు. అలాగే ఇంటర్నెట్ వినియోగదారులకు భద్రత, విశ్వాసాన్ని కలిగించేందుకు నరేంద్ర మోదీ  ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.  డీప్ ఫేక్ టెక్నాలజీతో తప్పుడు సమాచారం వైరల్ అయ్యే ఆస్కారం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ ఆయన ట్వీట్ చేశారు.

టాలీవుడ్ నటి రష్మికకు సంబంధించి అభ్యంతర రీతిలో ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, ఆ వీడియోలో ఉన్నది రష్మిక కాదు.  డీప్‍ఫేక్ అనే ఏఐ టెక్నాలజీని ఉపయోగించి రష్మిక ఫేస్‍ను మార్ఫ్ చేసి సృష్టించిన వీడియో అది. ఈ వీడియోలో రష్మిక.. డీప్‍నెక్ యోగా బాడీసూట్ వేసుకున్నట్టుగా ఉంది.

ఎవరో మహిళ వీడియోకు రష్మిక ఫేస్‍ను మార్ఫ్ చేసి ఈ డీప్‍ఫేక్ వీడియోను సృష్టించారు. ఇది నిజం అనుకొని కొందరు రష్మికను ట్రోల్ చేశారు. దీనిపై పలువురు ప్రముఖులతోపాటు, నెటిజన్లు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  ముఖ్యంగా బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ ఇలాంటి తప్పుడు వీడియోలపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

గుడ్‌బై మూవీతో బాలీవుడ్ అరంగేట్రం చేస్తున్న రష్మిక బిగ్‌బితో కలిసి ప్రస్తుతం నటిస్తున్నారు. ఈ ఫేక్ వీడియో గురించి తన ఇన్‍స్టాగ్రామ్ అకౌంట్‍లో స్టోరీ పోస్ట్ చేశారు రష్మిక మందన్నా. టెక్నాలజీ దుర్వినియోగం తనకే కాదు.. ప్రతీ ఒక్కరికీ చాలా భయంగా మారుతోందని పేర్కొన్నారు.  ఒకవేళ తాను చదువుకునేటప్పుడు ఇలా జరిగి ఉంటే ఎలా ఎదుర్కోవాలో కూడా తనకు అర్థమయ్యేది కాదని రష్మిక రాసుకొచ్చారు. ఐడెంటిటీ చోరీ ద్వారా మనలో ఎక్కువ మంది ప్రభావితం అయ్యే ముందే దీనికి సమాజంగా ఓ పరిష్కారం కనుగొనాలి” అని రష్మిక తన ఇన్‍స్టాగ్రామ్ స్టోరీలో కోరారు.