రాజ్యసభ నుంచి నిరవధికంగా సస్పెండ్ అయిన ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎంపీ రాఘవ చద్దా రాజ్యసభ చైర్మెన్ జగదీప్ ధంకర్కు షరతులు లేకుండా క్షమాపణలు చెప్పాల్సిందే అని శుక్రవారం సుప్రీంకోర్టు తెలిపింది. సెలెక్ట్ కమిటీ అంశం కేసులో సుప్రీంకోర్టు ఈ తీర్పును వెలువరించింది. ఒకవేళ ఎంపీ రాఘవ క్షమాపణలు చెబితే, అప్పుడు రాజ్యసభ చైర్మెన్ ఆ అంశంపై సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కోర్టు వెల్లడించింది.
సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పర్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఆ కేసులో ఆదేశాలు జారీ చేసింది. దివాళీ సెలవులు తర్వాత ఈ అంశంపై అప్డేట్ ఇవ్వాలని కూడా అటార్నీ జనరల్ వెంకటరమణిని కోర్టు ఆదేశించింది. రాజ్యసభ చైర్మెన్ జగదీప్ ధంకర్ను ఎంపీ రాఘవ చద్దా వ్యక్తిగతంగా కలుసుకోవాలని, ఆయనకు ఎటువంటి షరతులు లేకుండా క్షమాపణలు చెప్పాలని సీజేఐ తెలిపారు.
ఆగస్టు 11వ తేదీ నుంచి రాఘవ చద్దాపై సస్పెన్షన్ అమలులో ఉన్నది. వివాదాస్పద ఢిల్లీ సర్వీసుల బిల్లును అధ్యయనం చేసేందుకు ఒక సెలెక్ట్ కమిటీని ఏర్పాటు చేయాలని కోరేందుకు రూపొందించిన తీర్మానంపై తమ అనుమతి లేకుండానే తమ పేర్లను రాఘవ్ ఛద్దా చేర్చారని అధికార బిజెపికి చెందిన ఎంపీలతోసహా పలువురు ఎంపీలు ఫిర్యాదు చేశారు.
అయితే ఈ అంశాన్ని బీజేపీ ఎంపీలు తప్పుపట్టారు. ఈ ఫిర్యాదు ఆధారంగా రాఘవపై రాజ్యసభ చైర్మెన్ ఆగష్టు 11న సస్పెన్షన్ విధించారు. ఈ అంశాన్ని సభా హక్కుల కమిటీకి నివేదించారు. రాజ్యసభ చైర్మెన్కు క్షమాపణలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎంపీ రాఘవ కోర్టుకు వెల్లడించారు. నిరవధిక సస్పెన్షన్ను సవాల్ చేస్తూ ఆయన కోర్టును ఆశ్రయించారు. రాజ్యసభ రూల్స్, రాజ్యాంగంలోని 14, 21 ఆర్టికల్స్ను ఉల్లంఘించినట్లు ఆయన తన అఫిడవిట్లో ఆరోపించారు. సస్పెన్షన్ వల్ల పలు కమిటీల మీటింగ్కు హాజరుకాలేకపోతున్నట్లు ఎంపీ కోర్టుకు తెలిపారు.
More Stories
బెంగళూరులో సగం మంది ఓటర్లు ఇంటికే పరిమితం
కేజ్రీవాల్ జైలులో సీఎంగా కొనసాగడంపై హైకోర్టు అసహనం
రెండో దశలో 64.2 శాతం పోలింగ్