రాజస్థాన్ సిఎం కుమారుడికి ఈడీ సమన్లు

మరో నెల రోజుల్లో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. మరోవైపు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్ డోటాస్రా , మహువా నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి నివాసాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు గురువారం తనిఖీలు చేపట్టారు. 

ఫెమా నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించిన కేసులో వైభవ్‌కు ఈ సమన్లు అందినట్టు తెలిసింది. ఈ కేసులో వైభవ్‌ను ప్రశ్నించేందుకు అక్టోబర్ 27 న దర్యాప్తు సంస్థ ఎదుట హాజరు కావాలని ఈడీ పేర్కొన్నట్టు అధికారులు వెల్లడించారు.

ఇక పరీక్షా పత్రం లీక్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా కాంగ్రెస్ నేతల ఇళ్లల్లో ఈడీ గురువారం సోదాలు చేపట్టింది. సీకర్, జైపుర్‌లో గోవింద్ సింగ్‌కు చెందిన ఇళ్లు, కార్యాలయాలు, మహువా కాంగ్రెస్ అభ్యర్థి ఓం ప్రకాశ్ హుడ్లా నివాసంతో సహా పలు ప్రాంతాల్లో  తెల్లవారు జాము నుంచి ఈడీ తనిఖీలు కొనసాగాయి.

మొత్తం ఏడు ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ సోదాలు చేపట్టినట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి.   గ‌త వారం ఈడీ నిర్వ‌హించిన సోదాల్లో గోవింద్ సింగ్ కు చెందిన రూ.12 ల‌క్ష‌ల న‌గ‌దు ల‌భ్య‌మైంది. ఏడు చోట్ల నిర్వ‌హించిన త‌నిఖీల్లో ప‌లు కీల‌క‌మైన డాక్యుమెంట్ల‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. 

కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత దినేశ్ ఖోద‌నియా ఇంట్లో కూడా అధికారులు సోదాలు చేప‌ట్టారు. ప్ర‌భుత్వ స్కూల్ టీచ‌ర్ల ప‌రీక్ష పేప‌ర్ లీకేజీపై న‌మోదు అయిన కేసులు ఆధారంగా ఈడీ ద‌ర్యాప్తు మొద‌లుపెట్టింది. ప‌రీక్ష రాసిన అభ్య‌ర్థుల‌కు పేప‌ర్‌ను ప‌ది ల‌క్ష‌ల‌కు అమ్ముకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ కేంద్రంపై ధ్వజమెత్తారు. “ అక్టోబర్ 25న, రాజస్థాన్ మహిళల కోసం కాంగ్రెస్ హామీలు ప్రకటించింది. ఆ మరుసటి రోజు అక్టోబరు 26న రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్‌పై ఈడీ దాడులకు దిగింది. నా కుమారుడు వైభవ్‌కు సమన్లు జారీ చేసింది” అని తెలిపారు

“రాష్ట్రంలో మహిళలు, రైతులు, పేదలు, కాంగ్రెస్ ఇచ్చిన హామీల ప్రయోజనాలను పొందాలని బీజేపీ కోరుకోవడం లేదు. అందుకే ఇలా ఈడీతో ‘ఎర్ర గులాబీలు’ పంపిస్తోందని నేను చాలాసార్లు చెప్పాను. నా మాటలు ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటాయి” అని గెహ్లాట్ వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు.