2030 నాటికి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

2030 నాటికి భారతదేశం 7.3 లక్షల కోట్ల డాలర్ జిడిపితో ప్రపంచవ్యాప్తంగా చూస్తే 3వ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా నిలుస్తుందని అంచనా వేసింది ఎస్ అండీ పీ గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్. ఇదే క్రమంలో జపాన్‌ను వెనక్కి నెట్ ఆసియాలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించనుందంట. ఇప్పుడు భారత్ ఆర్థిక వ్యవస్థల పరంగా ప్రపంచంలో 5వ స్థానంలో ఉంది.
 
2022లో 3.5 లక్షల కోట్ల డాలర్లతో ఉన్న భారత ఎకానమీ ఇదివరకే బ్రిటన్, ఫ్రాన్స్‌ను వెనక్కి నెట్టింది. 2030 కల్లా జర్మనీని కూడా దాటనుంది.
2021, 2022లలో గణనీయ వృద్ధి సాధించిన భారత ఎకానమీ 2023 క్యాలెండర్ ఇయర్‌లోనూ స్థిర వృద్ధి కొనసాగిస్తూ వస్తోంది. ఈ 2023-24లో ఇండియన్ జీడీపీ 6.2-6.3 శాతం మేర వృద్ధి సాధించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.  దీంతో వేగంగా వృద్ధి సాధిస్తున్న దేశంగా కొనసాగనుంది భారత్.  
 
ఏప్రిల్- జూన్ క్వార్టర్‌లో 7.8 శాతం వృద్ధి నమోదు చేసింది భారత్. దేశీయంగా మంచి డిమాండ్‌తో 2023, 2024ల్లో భారత్ వృద్ధి జోరు కొనసాగుతుందని ఎస్ అండ్ పి తెలిపింది. దశాబ్ద కాలంలో భారత్‌లోకి ఎఫ్ డి ఐ (విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు) పెరగడం భారత దీర్ఘకాల వృద్ధికి దోహదపడుతుందని, యువ జనాభా, పట్టణ ఆదాయాలు పెరగడం కూడా సానుకూల అంశాలని వెల్లడించింది.

ప్రస్తుతం 25.5 లక్షల కోట్ల డాలర్ల జిడిపితో అమెరికా మొదటి స్థానంలో ఉంది. 18 లక్షల కోట్ల డాలర్లతో చైనా, 4.2 లక్షల కోట్ల డాలర్లతో జపాన్, 4 లక్షల కోట్ల డాలర్లతో జర్మనీ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 2030కి 110 కోట్ల మంది భారతీయులకు ఇంటర్నెట్ సదుపాయం లభించనుంది. 2020లో 50 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులతో పోలిస్ ఇది రెట్టింపు. 4జి టెక్నాలజీ నుంచి 5జి సాంకేతికతకు మారడంతో ఇ- కామర్స్ కూడా గణనీయంగా వృద్ధి చెందనుంది.


ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రపంచంలో వేగంగా వృద్ధి సాధిస్తున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగుతుందని కేంద్ర ఆర్థిక శాఖ నివేదిక తెలిపింది. దేశీయ మూలాలు బలంగా ఉండటం, ద్రవ్యోల్బణం తగ్గుతుందన్న అంచనాలు దీనికి కలిసివస్తుందని పేర్కొంది. అయితే, ఇజ్రాయెల్- పాలస్తీనా యుద్ధంతో అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొనడంతో ముడి చమురు ధరలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు సంకేతాలు కూడా ఇబ్బందికర పరిణామమేనని తెలిపింది