దేవరగట్టు బన్నీ ఉత్సవంలో ముగ్గురు మృత్యువాత

కర్నూలు దేవరగట్టు బన్నీ ఉత్సవంలో విషాదం చోటుచేసుకుంది. కర్రల సమరం సమయంలో ముగ్గురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. ఉత్సవంలో ఇద్దరు మృతి చెందగా, సింహాసనం కట్ట దగ్గర చెట్టు కొమ్మ విరిగిపడి మరొకరు మృత్యువాత పడ్డారు.  ఈ బన్నీ ఉత్సవంలో మరో 110 మందికి పైగా గాయాలపాలయ్యారు. 
 
క్షతగాత్రులను ఆలూరు, బళ్లారి, ఆదోని ఆస్పత్రులకు తరలించారు. కాగడాల దివిటీలను గాల్లోకి ఎగరేయడంతో పలువురికి కాలిన గాయాలయ్యాయి. పోలీసులు ఎన్ని ఏర్పాట్లు చేసినా రక్తం చిందకుండా ఆపలేకపోయారు.  మూడు నెలలుగా ఇంటింటికి తిరిగి ఇనుప రింగులు అమర్చిన కర్రల్ని పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు.
 
ఉత్సవాలను నియంత్రించేందుకు 1500 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినా పోలీసులు వారిని ఏ మాత్రం నియంత్రించ లేకపోయారు. జనం భారీ సంఖ్యలో తరలి రావడంతో పెద్ద సంఖ్యలో గాయపడ్డారు.

బన్నీ ఉత్సవాల్లో పాల్గొనేందుకు లక్షలాది జనం దేవరగట్టుకు తరలి వచ్చారు. ఓ చేతిలో కర్రతో కొందరు మరి కొందరు దివిటీలతో తరలి వచ్చారు.డిర్ర్‌ర్‌.. గోపరాక్‌.. అనే శబ్దాలతో దేవరగట్టు ప్రాంతం మార్మోగింది. వందల ఏళ్లుగా వస్తున్న సంప్రదాయాన్ని పాటిస్తూ బన్ని ఉత్సవాన్ని మంగళవారం అర్ధరాత్రి నిర్వహించారు.

ఆలూరు పట్టణానికి 15 కి.మీల దూరంలో హొళగుంద మండలం దేవరగట్టు శ్రీమాళమల్లేశ్వరస్వామి క్షేత్రంలో బన్ని ఉద్రిక్తంగా ఉత్కంఠంగా సాగింది. పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా యథావిధిగా కర్రల సమరం కొనసాగింది. దేవరగట్టుపై వెలసిన మాళ మల్లేశ్వరస్వామిని తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ప్రాంతాల ప్రజలు భక్తిభావంతో ఆరాధిస్తారు. 

ఏటా విజయదశమి రోజు అర్ధరాత్రి స్వామివారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. దేవరగట్టు బన్ని జైత్రయాత్రను చెడుపై మంచి సాధించిన విజయోత్సవ సంబరాలుగా మంగళవారం అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.  కళ్యాణోత్సవంలో నెరణికి, నెరణికితండా, కొత్తపేట, సులువాయి, ఆలూరు, బిలేహాలు, విరుపాపురం తదితర గ్రామాల ప్రజలు మంగళవారం అర్ధరాత్రి వేళ కర్రలు చేతపట్టి దేవరగట్టుకు చేరుకున్నారు. దేవుడి కోసం చేసే కార్యక్రమాన్ని ఐకమత్యంగా జరుపుకొంటామని ప్రతిజ్ఞ చేశారు.

కొండపై వెలసిన మాళ మల్లేశ్వరస్వామికి మల్లమ్మతో కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉత్సవ విగ్రహాలతో ఊరేగింపుగా జైత్రయాత్రకు బయల్దేరారు. గట్టుపై నుంచి కిందకు వచ్చి సింహాసన కట్ట వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఉత్సవ మూర్తులను దక్కించుకునేందుకు నెరణికి, కొత్తపేట, నెరణికితండా, బిలేహాల్‌, ఆలూరు, ఎల్లార్తి, సుళువాయి గ్రామాల మధ్య కర్రల సమరం సాగింది. కర్రలు తగిలి పెద్ద సంఖ్యలో గ్రామస్తులు గాయపడ్డారు.