గగన్‌యాన్‌లో మహిళలకు ప్రాధాన్యత!

మానవులను నింగిలోకి పంపించే గగన్‌యాన్ ప్రాజెక్టుకు భారత్ శరవేగంగా అడుగులు వేస్తోంది. వచ్చే ఏడాది నింగిలోకి దూసుకెళ్లనున్న గగన్‌యాన్‌ ప్రాజెక్టులో మహిళల భాగస్వామ్యం పెంచేందుకు కృషి చేస్తున్నట్లు ఇస్రో చీఫ్ ఎస్ సోమ్‌నాథ్‌ చెప్పారు.  మరోవైపు 2035 ఏడాది వరకు అంతరిక్షంలో పూర్తి స్థాయిలో కార్యకలాపాలు నిర్వహించేలా సొంతంగా భారత స్పేస్‌ స్టేషన్‌ను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
 
ఈ గగన్‌యాన్ ప్రాజెక్టులో భాగంగా మహిళా ఫైటర్‌ టెస్టు పైలట్లు, మహిళా సైంటిస్ట్‌లను భాగస్వామ్యం చేస్తామని ఇస్రో చీఫ్ వెల్లడించారు.  వీటితోపాటు వచ్చే ఏడాది నింగిలోకి దూసుకెళ్లనున్న మానవ రహిత గగన్‌యాన్‌ స్పేస్‌ క్రాఫ్ట్‌లో మహిళా రోబోను పంపిస్తామని చెప్పారు. ఈ మహిళా రోబో మనిషిని పోలి ఉంటుందని పేర్కొన్నారు.
 
ఈ ప్రాజెక్టులో భాగంగా అంతరిక్షంలోమూడు రోజులపాటు వ్యోమగాములను ఉంచి తిరిగి భూమి మీదికి సురక్షితంగా తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సోమ్‌నాథ్ వెల్లడించారు. అందుకోసం  ప్రస్తుతం ఎయిర్‌ఫోర్స్‌కు చెందినవారిని ఫైటర్‌ టెస్టు పైలట్‌ అభ్యర్థులుగా ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థులను వివిధ కేటగిరీల నుంచి ఎంపిక చేస్తామని తెలిపారు. 
 
ప్రస్తుతానిక మహిళా ఫైటర్‌ టెస్టు పైలట్లు అందుబాటులో లేరు. వారు ముందుకొస్తే ఓ మార్గం సుగమం అవుతుందని సోమనాథ్‌  చెప్పారు.
గగన్‌యాన్‌లో ప్రాజెక్టులో మహిళల భాగస్వామ్యం నెలకొల్పడానికి రెండో ఎంపిక శాస్త్రీయ కార్యకలాపాలతో కూడుకున్నదని చెప్పారు. ఈ ఎంపికలో శాస్త్రవేత్తలే వ్యోమగామిగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. 
 
దాంతో మహిళలకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని తాను విశ్వసిస్తున్నానని చెప్పారు.  గగన్‌యాన్‌ ప్రాజెక్టులో భాగంగా సోమవారం నిర్వహించిన తొలి టెస్ట్‌ వెహికల్‌ (టీవీ-డీ1) ప్రయోగం కాస్త ఆలస్యంగానైనా విజయవంతమైంది. 12 కిలోమీటర్ల ఎత్తులో క్రూ ఎస్కేప్‌ వ్యవస్థ రాకెట్‌ నుంచి విడిపోయి 17 కిలోమీటర్ల ఎత్తులో ఉండగా క్రూ ఎస్కేప్‌ మాడ్యూల్‌, క్రూ మాడ్యూల్‌ విడిపోయాయి. 
 
తర్వాత పారాచూట్లు విచ్చుకోవడంతో సెకనుకు 8.5 మీటర్ల వేగంతో క్రూ మాడ్యూల్‌ సురక్షితంగా బంగాళాఖాతంలో దిగింది. ఈ క్రమంలోనేన తీరానికి 10 కిలోమీటర్ల దూరంలో నావికాదళం దాన్ని స్వాధీనం చేసుకుంది.