“నవ్వుల మూట ” గా మారిన కెనడా ప్రధాని ట్రూడో

ప్రపంచ దేశాలతో ముఖ్యంగా అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌తో దౌత్యసంబంధాలు నెరిపే విషయంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో “నవ్వుల మూట ” గా తయారై హాస్యాస్పదం కలిగిస్తున్నారని కెనడా విపక్షనేత, కన్జర్వేటివ్‌పార్టీ నేత పియరీ పోలివ్రే ధ్వజమెత్తారు. 

నేపాల్ మీడియా సంస్థ నమస్తే రేడియో టోరంటోకు ఇచ్చిన ఇంటర్వూలో భారత్‌ను కెనడా దౌత్యవేత్తలు విడిచిపెట్టాలని ట్రూడో పిలుపునివ్వడంపై అడగ్గా, ఆయన అసమర్ధ ప్రధాని అని ఆరోపించారు. భారత్‌తోసహా ప్రపంచ దేశాలు దాదాపు ప్రతిదేశంతోనూ కెనడా సంబంధాలను దెబ్బతీశారని, ప్రతిదేశంతోనూ కెనడా ప్రధాని వివాదాలతో ఉంటోందని మండి పడ్డారు.

భారత్‌తో కొన్ని విభేదాలున్నా వాటికి జవాబుదారీగా నిలవడం మంచిదని, ముఖ్యంగా సత్సంబంధాలు కలిగి ఉండాలని సూచించారు. తాను ప్రధాని అయిన తర్వాత వీటిని పునరుద్ధరిస్తానని పియరీ పోలివ్రే పేర్కొన్నారు. కెనడా విదేశీ విధానంపై విమర్శలు గుప్పించిన పోలివ్రే, చైనా, అమెరికాల తీరుపై కూడా మండి పడ్డారు. 

స్థానికంగా రహస్యంగా పోలీస్ స్టేషన్లను తెరుస్తూ కెనడా అంతర్గత విషయాల్లో చైనా జోక్యం చేసుకుంటోందని ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ట్రూడోను డోర్ మ్యాట్‌లా చూస్తున్నారని ధ్వజమెత్తారు. కెనడా లోని హిందూ దేవాలయాలపై దాడులు జరగడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు

భారత్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం

ఇలా  ఉండగా,భారత్ అంతర్గత వ్యవహారాల్లో కెనడా పదేపదే జోక్యం చేసుకుంటున్నందున ఢిల్లీలోని ఆ దేశ దౌత్యవేత్తల సంఖ్యను తగ్గించాల్సి వచ్చిందని భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ పేర్కొన్నారు. భారత్, కెనడా మధ్య సాగుతున్న దౌత్య వివాదం లోకి అమెరికా, బ్రిటన్ జోక్యం చేసుకోవడంపై ఆయన ఘాటుగా స్పందించారు. 
 
దౌత్యవేత్తల సంఖ్య విషయంలో దేశాలు సమానత్వ సూత్రాన్ని పాటించవచ్చని వియన్నా కన్వెన్షన్‌లో ప్రస్తావించిన నిబంధనలనై తాము అనుసరిస్తున్నామని స్పష్టం చేశారు. ఇతర దేశాల దౌత్యవేత్తలకు , ప్రజలకు భద్రత కల్పించాలనేది వియన్నా కన్వెన్షన్‌లోని కీలకమైన నిబంధన అని, దీని అమలులో కెనడా విఫలమైందని విమర్శించారు. 
 
భారత ప్రజలకు, దౌత్యవేత్తలకు కెనడాలో భద్రత లేకుండా పోయిందని తెలిపారు. భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలు మెరుగైన తర్వాత వీసాల జారీని తిరిగి ప్రారంభిస్తామని వెల్లడించారు.