ప్రవళిక ఆత్మహత్య కేసులో పోలీసులకు ఎదురుదెబ్బ

ప్రవళిక ఆత్మహత్య కేసులో పోలీసులకు ఎదురుదెబ్బ
గ్రూప్ -2 పోటీ పరీక్షల వాయిదా కారణంగా ప్రవళిక అనే యువతీ ఆత్మహత్యకు పాల్పడినట్టు సహచర విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తుండగా, ప్రేమికుడు మోసం చేయడంతో ఈ దురాగతానికి పాల్పడినట్టు చెబుతున్న పోలీసులకు శుక్రవారం కోర్టులో చుక్కెదురైంది.
 
ప్రవళిక ఆత్మహత్య చేసుకునేందుకు కారణంగా భావిస్తున్న శివరాం రాథోడ్‌ మీద పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే, తనకు ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదంటూ శివరాం శుక్రవారం  నాంపల్లి కోర్టులో లొంగిపోయేందుకు రాగా, ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కోర్టు ఆవరణలోనే అరెస్టు చేశారు.
 
శివరాంకు వైద్య పరీక్షల అనంతరం శనివారం నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. కాగా, ఈ కేసులో సరైన సాక్ష్యాధారాలు లేనందున శివరాంకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ. 5000 వ్యక్తిగత పూచికత్తుతో వదిలేయాలని కోర్టు ఆదేశించింది. కాగా, ఈ కేసులో శివరాం కుటుంబ సభ్యులు కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రవళిక ఆత్మహత్య కేసులో తన అన్నయ్యకు ఎలాంటి సంబంధం లేదని శివరాం సోదరుడు మునిరామ్ రాథోడ్ స్పష్టం చేశారు.
ఈ కేసులో తమకు పోలీసుల నుంచి వేధింపులు ఎక్కువయ్యాని ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులే కేసును తారుమారు చేస్తున్నారని కీలక ఆరోపణలు చేశాడు.  మరోవైపు,  శివరాం తల్లిదండ్రులు కూడా తన కుమారునికి ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. శివరాంను అదుపులోకి తీసుకునే సమయంలో భోరున విలపించారు. శివరాంకు ఈ కేసు సంబంధమున్నట్టు పోలీసులు దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని అతని తరపు న్యాయవాధి కూడా  వాధించారు. 
 
ఇదిలా ఉంటే, ప్రవళిక ఆత్మహత్య ప్రస్తుతం ఎన్నికల సమయంలో రాష్ట్రంలో సంచలంగా మారింది. మొదట గ్రూప్-2 వాయిదా వల్లే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని విద్యార్థులంతా పెద్ధ ఎత్తున ఆరోపణలు చేశారు. అయితే, ఆ తర్వాతి రోజే ఆమె ఆత్మహ్యకు కారణం గ్రూప్-2 పరీక్ష వాయిదా కాదని, ప్రేమ వ్యవహారమే అసలు కారణమని పోలీసులు  ప్రకటించారు. 
 
అందుకు సంబంధించిన ఆధారాలు కూడా తమ దగ్గర ఉన్నట్లు పోలీసులు  చెప్పుకొచ్చారు. మరోవైప ప్రవళిక కుటుంబ సభ్యులు మాత్రం శివరాం వేధింపులు తట్టుకోలేకనే ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో కోర్టు అతనికి బెయిల్ ఇవ్వటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 
 
సంబంధం లేని గిరిజన యువకుడిని ఇరికించారు

మరోవంక, ప్రవళిక‌ ఆత్మహత్య కేసులో సంబంధం లేని గిరిజన యువకుడిని ఇరికించారని మాజీ మంత్రి, బీజేపీ నేత  రవీంద్ర నాయక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని గిరిజనులకు ఆయన పిలుపునిచ్చారు. డీసీపీ‌ తన ఉద్యోగం కోసం గిరిజన యువకుడిని అన్యాయంగా ఇరికించారని ఆరోపించారు. 
 
ప్రభుత్వ అసమర్థ నిర్వాకం వల్లే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని చెబుతూ ప్రవళిక తల్లిదండ్రులను ప్రగతి భవన్‌కు పిలిపించుకుని ప్రలోభ పెట్టారని చెప్పారు. లేని కట్టుకథను అల్లి శివరాంను కేసులో అన్యాయంగా ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆధారాలు లేవని కోర్టు చెప్పినా అరెస్ట్ చేయటం దుర్మార్గం అంటూ విమరసంచారు. 
 
ప్రవళిక ఆత్మహత్యను ప్రేమ వ్యవహారంగా కేసీఆర్ ప్రభుత్వం చిత్రీకరించడం పట్ల తీవ్ర నిరసనను వ్యక్తం చేస్తూ ఎన్నికల్లో ఇబ్బంది అవుతోందని, తల్లిదండ్రులను ప్రగతి భవన్‌కు పిలిపించి మంత్రి కేటీఆర్ మాట్లాడారని ఆరోపించారు. 12 శాతం రిజర్వేషన్లు, పోడు పట్టాల పేరుతో కేసీఆర్ గిరిజనులను రెండుసార్లు మోసం చేశాడని విమర్శించారు. గిరిజనులపై అత్యాచారాలను నియంత్రించటంలో ప్రభుత్వం విఫలం అయిందని రవీంద్ర నాయక్ మండిపడ్డారు.