చండీగఢ్, ముంబై, బెంగళూరులలో సేవలు నిలిపివేసిన కెనడా

ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్‌ హత్య కేసుకు సంబంధించి భారత్‌-కెనడాల మధ్య వివాదం రాజుకున్న వేళ కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు కెనడా భారత్ నుంచి 41 మంది దౌత్యవేత్తలను, 42 మంది వారి సహాయకులు, డిపెండెంట్లను ఉపసంహరించుకోవడంతో వీసా సర్వీసులకు తీవ్ర విఘాతం ఏర్పడనున్నది. 

చండీగఢ్, ముంబై, బెంగళూరులోని తమ కాన్సులేట్ల నుంచి ప్రత్యక్ష సర్వీసులను నిలిపివేస్తున్నట్లు కెనడా విదేశాంగ మంత్రి మెలనీ జోలీ ప్రకటించారు.  ఢిల్లీలో మాత్రం ప్రత్యక్ష సర్వీసులు అందుబాటులో ఉంటాయని ఆమె సూచించారు. 

తమ దేశంలోని అన్ని దేశాలకు చెందిన దౌత్యపరమైన సిబ్బంది సంఖ్యను సమాన స్థాయిలో కుదించాలని భారత్ తన నిర్ణయాన్ని ఏకపక్షంగా ప్రకటించిందని, ఇందులో భాగంగా అక్టోబర్ 20 నాటికి ఢిల్లీ నుంచి 21 మంది మినహా మిగిలిన దౌత్యవేత్తలను, వారి సహాయకులను ఉపసంహరించాలని ఆదేశించిందని జోలీ తెలిపారు. 

ఈ ఆదేశాలను పాటించడం మినహా తమకు వేరే గత్తంతరం లేదని, తమ దౌత్యవేత్తల భద్రతే తమకు అత్యంత ముఖ్యమని జోలీ తెలిపారు.  కెనడా దౌత్యవేత్తల గుర్తింపును భారత్‌ ఉపసంహరించుకోవడం అనైతిక, అసాధారణ చర్యగా ఆమె అభివర్ణించారు. ఈ చర్యతో భారత్‌ దౌత్య సంబంధాలపై కుదుర్చుకున్న వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆమె ఆరోపించారు. 

దౌత్యపరమైన విధానాలను నాశనం చేయాలనుకుంటే ప్రపంచంలో ఎక్కడా దౌత్యవ్యవస్థ ఉండబోదని, అందుకే కెనడా ప్రతీకార చర్యలకు పాల్పడబోదని ఆమె స్పష్టం చేశారు. భారత్‌లో ప్రస్తుతం కేవలం 21 మంది కెనడా దౌత్యవేత్తలు మిగిలారని ఆమె చెప్పారు. కెనడాలో ఉన్న భారత దౌత్యవేత్తలతో పోలిస్తే భారత్‌లో ఉన్న దౌత్యవేత్తల సంఖ్య చాలా ఎక్కువ. 

దీనికి కారణం భారత్‌లో భారీ సంఖ్యలో వీసాలను పరిశీలించవలసి ఉండడం. కెనడాలో ఉన్నత విద్యను అభ్యసించడానికి భారత్ నుంచి వెళ్లే విద్యార్థుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. 2022లో రికార్డు స్థాయిలో 2.26 లక్షల మంది విద్యార్థులకు వీసాలు మంజూరయ్యాయి. మొత్తంగా 6 లక్షలకు పైగా వీసాల పరిశీలన గత ఏడాది జరిగినట్లు జోలీ తెలిపారు.

తమ దేశాన్ని వీడని కెనడా దౌత్యవేత్తలకు భద్రతాపరమైన ఇబ్బందులు తలెత్తుతాయని భారత ప్రభుత్వం చెబుతోందని, తమ దౌత్యవేత్తల భద్రతే తమకు అత్యంత ముఖ్యమని ఆమె చెప్పారు. వారు సురక్షితంగా కెనడాకు తిరిగివచ్చేందుకు తగిన చర్యలు తీసుకున్నామని ఆమె వివరించారు.

భారత్ లో పర్యటించే కెనడా పౌరులకు హెచ్చరిక

41 మంది కెనడా దౌత్యవేత్తలు భారత్‌ను వీడినట్లు ప్రకటించిన తర్వాత కొద్దిసేపటికే భారత్‌లో పర్యటిస్తున్న తమ దేశ పౌరులకు కెనడా కీలక హెచ్చరికలు చేసింది. భారత్‌లోని పలు నగరాల్లో ఉన్న కెనడా వాసులు అప్రమత్తంగా ఉండాలని అడ్వైజరీ జారీ చేసింది. ఇటీవలే చోటు చేసుకున్న పరిణామాలతో భారత మీడియా, సామాజిక మాధ్యమాల్లో కెనడాపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని అడ్వైజరీలో పేర్కొంది. 

ఈ క్రమంలోనే కెనడా పౌరులపై బెదిరింపులు, వేధింపులు జరగొచ్చని అనుమానం వ్యక్తం చేసింది. అందువల్ల దేశ రాజధాని ఢిల్లీ, ఎన్‌సీఆర్‌ ప్రాంతాలతోపాటు బెంగళూరు, చండీగఢ్‌, ముంబై నగరాల్లో ఉన్న కెనడియన్లు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. రద్దీ ప్రదేశాల్లోకి వెళ్లినప్పుడు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. ఎవరూ తమ వ్యక్తిగత వివరాలను ఇతరులతో పంచుకోవద్దని హెచ్చరించింది.