ముడి చమురు ధర 100 డాలర్లకు పెరుగుతుందా!

ఇజ్రాయిల్ – హమాస్ ల యుద్ధం ప్రారంభమై వారం అవుతున్నా ఆగిపోయే సంకేతాలు కనిపించకపోవడం, దీర్ఘకాలం కొనసాగే అవకాశాలు స్పష్టం అవుతూ ఉండడంతో ముడి చమురు ధరలకు రెక్కలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ యుద్ధం మరింతగా ముదిరితే ముడి చమురు ధర విపరీతంగా పెరగవచ్చని మార్కెట్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

సెప్టెంబరు నుండి ప్రపంచ క్రూడ్ ఆ యిల్ ధరలు అస్థిరతకు లోనవుతుండగా, ఈ జిప్ట్, లెబనాన్ వంటి ఇతర దేశాలు రంగంలోకి దిగితే పరిస్థితి సమస్యాత్మకంగా మారవచ్చు. యుద్ధం ముదిరితే క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్‌కు 95 నుండి 100 డాలర్ల వరకు పెరగవచ్చని ఐసిఐసిఐ సెక్యూరిటీస్‌లోని పరిశోధన విశ్లేషకుడు తెలిపారు.

ఇజ్రాయెల్‌కు సహాయం చేయడానికి అమెరికా ఆయుధాలను పంపింది. ఇరాన్ హమాస్‌కు సహాయం చేస్తుందన్న నివేదికల నేపథ్యంలో సంఘర్షణ ఇతర ప్రాంతాలకు వ్యాపించవచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కు చెందిన ఒక ఆర్థికవేత్త యుద్ధం ముగియవచ్చని అంచనా వేశారు. బ్యారెల్‌కు 85 నుంచి 95 డాలర్ల ధర ప్రత్యేకించి సవాలు కాదనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.

భారతదేశంలో ప్రస్తుత, వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్నందున దేశీయంగా ముడి చమురు ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ, వాటి ప్రభావం పడకుండా ప్రభుత్వం భరించే అవకాశముందని భావిస్తున్నారు.  అయితే, భారత్ ముడిచమురు దిగుమతులు సగంకు పైగా ఈ ప్రాంతం నుండే ఉండడంతో ఆర్థికంగా భారత్ తీవ్ర వత్తిడులకు గురయ్యే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే, మూడీస్ నివేదిక ప్ర కారం, ముడి చమురు బ్యారెల్‌కు 100 డాలర్లకు చేరుకున్నప్పటికీ భారతదేశానికి పెద్ద ముప్పు ఉండబోదు. రిఫైనింగ్‌కు రక్షణ కల్పించినంత కాలం అధిక ముడి చమురు ధరలు కంపెనీలపై గణనీయమైన ప్రభావం చూపబోవు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతున్నా కొంతకాలంగా భారత్ లో పాత ధరలే కొనసాగుతూ ఉండటం గమనార్హం.

వాస్తవానికి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు అక్టోబర్ లో పెట్రోల్, డీజిల్ ధరలు బాగా తగ్గవచ్చని ప్రభుత్వ వర్గాలు గతంలో సంకేతాలు ఇచ్చాయి. అయితే మధ్యఆసియాలో తాజాగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఆ ప్రతిపాదనకు తిలోదకాలిచ్చిన్నట్లు కనిపిస్తున్నది.