ఇజ్రాయెల్పై హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు) చేసిన మెరుపుదాడిని ప్రధాని నరేంద్ర మోదీ ఇదివరకే ఖండించిన విషయం తెలిసిందే. హమాస్ దాడి చేసిందన్న విషయం తెలిసిన కొన్ని గంటల్లోనే ఆయన ట్విటర్ మాధ్యమంగా ఈ దాడిపై స్పందించారు. ఈ దాడి తనని బాధించిందని, ఈ క్లిష్ట సమయంలో తాము ఇజ్రాయెల్కి అండగా ఉంటామని తెలిపారు.
ఇందుకు ఇజ్రాయెల్ మంత్రి కృతజ్ఞతలు కూడా తెలిపారు. తాజాగా ప్రధాని మోదీ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమన్ నెతన్యాహుతో ఫోన్లో మాట్లాడారు. నెతన్యాహు మంగళవారం తనకు ఫోన్ చేశారని, హమాస్తో జరుగుతున్న యుద్ధం గురించి తనతో చర్చించారని ప్రధాని మోదీ తెలిపారు. ఇజ్రాయెల్కు భారత్ అన్ని విధాలుగా మద్దతు ఇస్తుందని నెతన్యాహుకు తాను హామీ ఇచ్చానని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని అన్ని రకాలుగానూ భారతదేశం తీవ్రంగా ఖండిస్తుందని మోదీ స్పష్టం చేశారు.
‘‘తనకు ఫోన్ చేసి, ప్రస్తుతం హమాస్తో కొనసాగుతున్న ఘర్షణపై అప్డేట్ అందించినందుకు ప్రధానమంత్రి నెతన్యాహుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ క్లిష్ట సమయంలో భారతదేశ ప్రజలు ఇజ్రాయెల్కి అండగా నిలబడతారు. అన్ని విధాలుగానూ భారతదేశం ఉగ్రవాదాన్ని నిస్సందేహంగా ఖండిస్తుంది’’ అంటూ ప్రధాని మోదీ ట్విటర్ (X ప్లాట్ఫామ్) మాధ్యమంగా రాసుకొచ్చారు.
అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ దేశాలు ఇజ్రాయెల్కు తమ మద్దతు తెలియజేస్తూ, హమాస్ ఉగ్రవాద చర్యల్ని ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో ప్రధాని మోదీకి ఇజ్రాయెల్ నుంచి ఈ ఫోన్ కాల్ వచ్చింది. ఇజ్రాయెల్తో పాటు పాలస్తీనాకు భారత్ మిత్రదేశమని, ప్రస్తుత సంక్షోభాన్ని పరిష్కరించడంలో సహాయం చేయడానికి తప్పనిసరిగా ముందుకు రావాలని భారత్లోని పాలస్తీనా రాయబారి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మోదీ, నెతన్యాహు మధ్య జరిగిన ఈ సంబాషణకు ప్రాధాన్యత సంతరించుకుంది.
అయితే పాలస్తీనా విషయంలో భారత్ నుంచి ఎలాంటి స్పందన లేదు. మహాస్ “ఉగ్రవాద” దాడిని వ్యతిరేకిస్తూ ఇజ్రాయెల్కు మద్దతుగా నిలిచింది.గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం నాలుగు రోజులుగా కొనసాగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్ దాడుల్లో 143 మంది పిల్లలు, 105 మంది మహిళలు సహా 704 మంది మరణించారు. 4,000 మందికి పైగా గాయపడ్డారు. ఇక హమాస్ దాడి కారణంగా ఇజ్రాయెల్లో కనీసం 900 మంది మరణించారు. 2,600 మంది గాయపడ్డారు. బందీలుగా ఉన్న 100 మంది ఇజ్రాయెల్ పౌరుల మృతదేహాలు ఓ వ్యవసాయ పొలంలో లభించాయి.
More Stories
కాంగ్రెస్కు అధికారమిస్తే రామాలయాన్ని కూల్చేస్తారు
ఆప్ తనను `బిజెపి ఏజెంట్’ అనడంపై మండిపడ్డ స్వాతి మలివాల్
మోదీకి అండగా 60 కోట్ల మంది లబ్ధిదారుల సైన్యం