మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌కు హెచ్‌సీఏ అనర్హత వేటు

టీమిండియా మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్‌పై అనర్హత వేటు పడింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఎన్నికల్లో పోటీ చేయకుండా అజారుద్దీన్‌పై జస్టిస్ లావు నాగేశ్వరరావు కమిటీ అనర్హత వేటు వేసింది.  హెచ్‌సీఏ ఓటర్ జాబితా నుంచి కూడా అజారుద్దీన్ పేరు తొలిగించింది కూడా. 
హెచ్‌సీఏ అధ్యక్షుడి బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలోనే డెక్కన్ బ్లూస్‌కి కూడా అధ్యక్షుడిగా అజారుద్దీన్ వ్యవహరించారు.
అయితే, హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉండి రూల్స్ పాటించలేదంటూ కమిటీ అనర్హత వేటు వేసింది. హెచ్‌సీఏ ఎన్నికల కోసం 30న నోటిఫికేషన్‌ విడుదలైంది.
హెచ్‌సీఏ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సహాయ కార్యదర్శి, కోశాధికారి, ఈసీ పోస్టుల కోసం అక్టోబర్‌ 11 నుంచి 13 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఆ తర్వాత 14న నామినేషన్ల పరిశీలన జరుగనుంది.
అక్టోబర్‌ 16వ తేదీ లోపు నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు అవకాశం ఇస్తారు. చివరగా 20న పోలింగ్‌ నిర్వహించి, అదే రోజు సాయంత్రం ఫలితాలు వెల్లడిస్తారు.  అయితే అజారుద్దీన్‌‌కు హెచ్‌సీఏ కార్యవర్గ సభ్యుల మధ్య పలు విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హెచ్‌సీఏకు సంబంధించిన పలు కేసులు న్యాయస్థానాలకు చేరాయి. వీటిపై చాలాసార్లు విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం ఈ గొడవలన్నింటికీ ముగింపు పలకాలంటే  ఎన్నికలు నిర్వహించడం ఒక్కటే పరిష్కారమేనని అభిప్రాయపడింది.
 
సుప్రీం కోర్టు అభిప్రాయం మేరకు ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు తెలుస్తోంది. గతేడాది ఆగస్టు 22న హెచ్‌సీఏ పర్యవేక్షణ కోసం సుప్రీం కోర్టు జస్టిస్‌ కక్రూ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది. కాగా ఆ కమిటీ సభ్యుల్లోనూ విభేదాలు తలెత్తాయి. దీంతో ఆ కమిటీని కూడా రద్దు చేసిన సర్వోన్నత న్యాయస్థానం హెచ్‌సీఏ రోజువారీ కార్యకలాపాల నిర్వహణ, ఎన్నికల పర్యవేక్షణ బాధ్యతలను మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వరరావుకు కట్టబెట్టింది.