ఎన్డీఏలో చేర్చుకోమని కేసీఆర్ వెంటబడ్డారు

 
జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ ఢిల్లీ వచ్చి తనను కలిశారని, ఎన్డీఏలో చేర్చుకోవాలని అభ్యర్థించారని ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వాఖ్యలు చేశారు. కేటీఆర్ ను ఆశీర్వదించాలని కేసీఆర్ అడిగారని, ఇది రాచరికం కాదని కేసీఆర్ కు చెప్పానని, ప్రజలు ఆశీర్వదించిన వాళ్లే పాలకులని చెప్పానని వెల్లడించారు. ఈ తర్వాత ఎన్నడూ కేసీఆర్ తననను కలవలేదని తెలిపారు. 
 
ఇందూరు జనగర్జన సభలో ప్రసంగిస్తూ  తాను ఎప్పుడు తెలంగాణ వచ్చినా స్వాగతం పలికేందుకు సీఎం కేసీఆర్ రాకపోవడం వెనుకగల రహస్యాన్ని వెల్లడించారు. అంతకు ముందు గజమాలలతో తనకు స్వాగతం పలికేవారని గుర్తు చేశారు. ఇప్పుడు తన కళ్లలోకి చూసి ధైర్యం కేసీఆర్ లేదని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. 
 
“జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు కేసీఆర్ తనకు గజ మాలలతో స్వాగతం పలికేవారు. కానీ జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. ఎందుకో అసలు రహస్యం చెప్తున్నా. జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ ఢిల్లీ వచ్చారు. శాలువా కప్పి మరీ ఎంతో మర్యాద చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని కేసీఆర్ కోరారు. బీజేపీకే మేయర్ పదవి కూడా ఇస్తామని చెప్పారు” అని ప్రధాని బహిర్గతం చేశారు. 
 

అయితే, విపక్షంలో కూర్చుంటాం కానీ మద్దతు ఇవ్వమని చెప్పానని, ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్‌తో కలిసే ప్రసక్తే లేదని స్పష్టం చేశానని చెప్పారు.  ప్రజలు ఆశీర్వదించిన వారే పాలకులని, బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకోబోమని ఆరోజు తేల్చి చెప్పానని అంటూ మోదీ చెప్పుకొచ్చారు.

“జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత మళ్లీ కేసీఆర్‌ దిల్లీ వచ్చి నన్ను కలిశారు. తాను కూడా ఎన్డీయేలో చేరతానని అడిగారు. కేటీఆర్‌కు బాధ్యతలు అప్పగిస్తానని, ఆశీర్వదించాలని కోరారు. మీరేమైనా రాజులా? ఇదేమైనా రాచరికమా? యువరాజును సీఎం చేయడానికి అని అడిగాను. ఇక అదే ఆఖరి రోజు. అప్పటి నుంచి వాళ్లు నా కళ్లలోకి కళ్లు పెట్టి చూడలేదు. అప్పటి నుంచే కేసీఆర్ నన్ను కలవటం మానేశారు” అంటూ ప్రధాని వెల్లడించారు.

ఇక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత తెలంగాణ తరఫున గట్టిగా పోరాడాలని బీజేపీ నిర్ణయించిందని, జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత హైదరాబాద్‌ వస్తే ప్రజలు తనకు అపూర్వ స్వాగతం పలికారని మోదీ అసలు విషయాన్ని చెప్తున్నట్టు తెలిపారు. తెలంగాణ అభివృద్ధి కోసం బీజేపీ కట్టుబడి ఉందని ప్రధాని మోదీ స్పష్టం చేస్తూ తెలంగాణ ప్రజల సంపదను ఓ కుటుంబం దోచుకుంటోందని ఆరోపించారు. 
 
ఎంతో మంది బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆ ప్రతిఫలాన్ని ఒక కుటుంబమే అనుభవిస్తోందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రం ఏర్పాటుతో సీఎం కేసీఆర్‌, ఆయన కుటుంబసభ్యులు మాత్రమే ధనికులయ్యారని విమర్శించారు.  తెలంగాణ యువత కుటుంబ పాల‌న‌కు మ‌రో అవ‌కాశం ఇవ్వొద్ద‌ని ప్ర‌ధాని విజ్ఞప్తి చేశారు.
 
తెలంగాణలో పూర్తిగా కుటుంబ పాలన నడుస్తోందని.. కేసీఆర్‌తో పాటు ఆయన కుమారుడు, కుమార్తే, అల్లుడు ఇలా ఎంత మంది కుటుంబసభ్యులుంటే అంతమంది పదవులు అనుభవిస్తున్నట్టు చెప్పుకొచ్చారు మోదీ. అయితే.. ఆనాడు తెలంగాణకు రజాకర్ల నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ విముక్తి కల్పించారని.. ఇప్పుడు మరోసారి తెలంగాణకు కుటుంబ పాలన నుంచి విముక్తి కల్పించేందుకు మరో గుజరాతీ సిద్ధమయ్యాడంటూ ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.
 
“కర్ణాటక ఎన్నికలకు బీఆర్ఎస్ నేతలే డబ్బులు అందించారు. తెలంగాణ డబ్బును కర్ణాటక ఎన్నికల్లో ఖర్చు పెట్టారు. కర్ణాటక ఎన్నికల్లోలాగా తెలంగాణలోనూ డబ్బులు కుమ్మరించాలని చూస్తున్నారు. కాంగ్రెస్ అధికార దాహంతో అల్లాడుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్‌ది ఒకటే సిద్ధాంతం. ఎన్నికల ముందు వాగ్ధానాలు ఇవ్వటం, తర్వాత వాటిని పూర్తిగా మర్చిపోవటం వాళ్ల పాలసీ” అంటూ ప్రధాని ఆ రెండు పార్టీలపై విమర్శలు గుప్పించారు. 
 
దక్షిణ భారతదేశ ప్రజలను కాంగ్రెస్ మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందని ప్రధాని హెచ్చరించారు. “ఎంత జనాభా ఉంటే అంత హక్కు అని కాంగ్రెస్ అంటోంది. ఆలయాల సంపదను మొత్తం దోచుకుంటున్నారు. కానీ మైనార్టీ ప్రార్థనాస్థలాల జోలికి మాత్రం వెళ్లే సాహసం కూడా చేయరు.” అంటూ ఇందూరు సభావేదికగా ఎన్నికల శంఖారావాన్ని పూరించారు ప్రధాని మోదీ.
 
నిజామాబాద్ నుండి వర్చువల్ గా రూ.8,021 కోట్ల విలువైన పనుల ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ ను జాతికి అంకితం చేశారు. మనోహరాబాద్-సిద్దిపేట రైల్వేలైన్ ను, 20 క్రిటికల్ కేర్ బ్లాకులను ప్రారంభించారు.