లోకేష్ సిఐడి విచార‌ణ 10కి వాయిదా

లోకేష్ సిఐడి విచార‌ణ 10కి వాయిదా

బుధవారం జరగాల్సిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ సీఐడీ విచారణ ఈనెల 10కి వాయిదా పడింది. ఈ మేరకు సీఐడీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్పు కేసులో సీఐడీ ఇచ్చిన 41ఏ నోటీసులోని నిబంధనలను నారా లోకేష్ హైకోర్టులో సవాల్ చేశారు. లోకేష్‌ ఇచ్చిన లంచ్ మోషన్ పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది.

లోకేష్ ప్రస్తుతం హెరిటేజ్‌లో షేర్ హోల్డర్ అని లోకేష్ తరపు న్యాయవాదులు చెప్పారు. ఆయనకు తీర్మానాలు, బ్యాంక్ అకౌంట్ పుస్తకాలు ఇవ్వాలంటే కంపెనీ ప్రొసీజర్ ఉంటుందని తెలిపారు. లోకేష్‌ను ఇవి అడగడం సమంజసం కాదని సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. తాము డాక్యుమెంట్లపై ఒత్తిడి చేయబోమని, బుధవారమే విచారణకు హాజరు కావాలని సీఐడీ తరపు న్యాయవాదులు కోరారు. అంత తొందర ఏముందని లోకేష్ తరపు న్యాయవాది పోసాని ప్రశ్నించారు. 

ఇరువర్గాల వాదనల అనంతరం ఈనెల 10వ తేదీన విచారణకు హాజరుకావాలని హైకోర్టు ఆదేశాలు చేసింది. 10వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ మాత్రమే విచారణ చేయాలని ఆదేశించింది. న్యాయవాదిని అనుమతించాలని కూడా ఆదేశాల్లో పేర్కొంది. మధ్యాహ్నం గంటపాటు లంచ్ బ్రేక్ ఇవ్వాలని సీఐడీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

నారాయణ కేసులపై విచారణ వాయిదా

మరోవంక, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ మంత్రి నారాయణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. 60 ఏళ్ల వయసులో తాను విచారణకు హాజరుకాలేనని, తన దగ్గరకే వచ్చి విచారణ జరపాలంటూ  పిటిషన్ వేశారు. బుధవారం సీఐడీ విచారణకు హాజరుకాలేనన్న నారాయణ నాలుగైదు రోజులు గడువు ఇవ్వాలని కోర్టును కోరారు. 
 
గతంలో కూడా తనను ఇంటివద్దనే విచారించారని పిటిషన్‍లో ప్రస్తావించారు. అన్ని కేసులను ఈనెల 16కు వాయిదా వేసింది. అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఎఫ్‌ఐఆర్ రద్దు చేయాలని నారాయణ క్వాష్ పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై విచారణ హైకోర్టు ఈ నెల 16కు వాయిదా వేసింది.