ధర్మ రక్షణకై ప్రారంభమైన “శౌర్య జాగరణ యాత్ర”

పగుడాకుల బాలస్వామి
తెలంగాణ ప్రచార ప్రముఖ్, విశ్వహిందూ పరిషత్


భరతమాత సేవలో పాలుపంచుకునేందుకు నేటి యువతరాన్ని జాగృతం చేస్తోంది బజరంగ్ దళ్. తల్లి భారతి సేవలో తరించేందుకు యువతలో చైతన్యం తీసుకువస్తోంది. దేశంలోని గ్రామ సీమలన్నింటిని జాగృతం చేసేందుకు “శౌర్య జాగరణ యాత్ర” చేపట్టింది. దేశం కోసం, ధర్మం కోసం బలిదానాలు చేసిన వీరుల ధీర చరిత్రను నేటి తరానికి తెలియజేసేందుకు భారీ ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. 
 
మన పూర్వీకుల త్యాగం, మన దేశ నాయకుల గొప్పతనం, వీరమాతల స్ఫూర్తిని నేటి యువతకు అవగాహన పరచడమే లక్ష్యంగా “శౌర్య జాగరణ యాత్ర” బయలుదేరుతుంది. దేశంలోని కొండాకోన, గల్లీ పల్ల, ఊరు వాడా, పల్లే పట్టణం అన్నింటినీ జాగృతం చేసి భరతమాత సేవలో తరించేందుకు చైతన్యం తీసుకువస్తోంది బజరంగ్ దళ్. సెప్టెంబర్ 30వ తేదీ ప్రారంభమైన ఈ యాత్ర అక్టోబర్ 14వ తేదీ వరకు దేశంలోని దాదాపు 5 లక్షలకు పైగా గ్రామాల్లో యువతను జాగృతం చేసేందుకు కొనసాగుతుంది.
 
కులాలకు అతీతంగా ప్రతి హైందవ సోదరుడు యాత్రలను ఆదరించి దేశ రక్షణకు కంకణం కట్టాలని విశ్వహిందూ పరిషత్ పిలుపునిస్తోంది. హిందూ సంఘటనతోనే దేశం పురోగతి సాధిస్తుంది. విధర్మీయుల కుట్రలతో నేడు అనేక విధాలుగా ధర్మంపై దాడి జరుగుతోంది. కాబట్టి దాడిని ఎదుర్కొని,  ధర్మాన్ని పరిరక్షించుకునే  బాధ్యత ప్రతి హిందువులపై ఉంది. అచంచలమైన ఆత్మవిశ్వాసంతో కదం తొక్కుతూ పదం పాడుతూ బజరంగ్దళ్ యాత్రలో పాల్గొందాం. హిందూ సంఘటనతో ధర్మ రక్షణ చేద్దాం.

నేడు సమాజంలో భారతీయతపై, హిందుత్వంపై అరాచకవాదులు దాడులకు తెగబడుతున్నారు. సనాతన ధర్మాన్ని పెకిలించి వేస్తామని వెకిలి మాటలు మాట్లాడుతున్నారు. అలాంటి అరాచక, ఉగ్రముఖలకు తగిన రీతిలో బుద్ధి చెప్పేందుకు హిందూ సమాజం సిద్ధంగా ఉండాలి. ధర్మరక్షణలో ఎంతటి త్యాగానికైనా బజరంగ్ దళ్ సంసిద్ధమే. హేతువాదులు, లౌకిక వాదుల ముసుగులో ధర్మాన్ని కించపరిస్తే  ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. 

 
 దేశంలోని యావత్ యువతను మేల్కొల్పేందుకు విశ్వహిందూ పరిషత్ – బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో  శౌర్య జాగరణ యాత్ర చేపట్టడం నేడు అత్యవసరం. దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ యాత్రలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పల్లె, ప్రతి జిల్లాలో యాత్ర కొనసాగడం శుభ పరిణామం. పక్షం రోజులపాటు శౌర్య జాగరణ యాత్ర నిర్వహించి, భారతీయ యువతను మేల్కొల్పి దేశ చరిత్ర, భద్రత విషయంపై సంపూర్ణ అవగాహన కల్పించేందుకు సదస్సులు, సమావేశాలు ఏర్పాటు చేసేందుకు విశ్వహిందూ పరిషత్ నిర్ణయించింది.

భారతీయం కోసం, సనాతన ధర్మం కోసం పోరాడిన పరాక్రమ వీరుల చరిత్రను నేటి సమాజానికి తెలియజేసి, జాగృతం చేయడం, వక్రీకరించిన చరిత్ర కాకుండా, వాస్తవ చరిత్రను నేటి సమాజానికి అవగాహన కల్పించి, దేశభక్తిని రగిలించడమే లక్ష్యంగా యాత్ర కొనసాగడం గొప్ప విషయం. మన పుణ్యభూమి, వేద భూమి, కర్మభూమి అయినా భరత భూమి గొప్ప చరిత్ర కలిగి ఉంది.  

 
మహా పురుషులు, స్వాతంత్ర సమరయోధులు, వీర వనితలు, వీరమాతల ధైర్య శౌర్య పరాక్రమాలు నేటి సమాజానికి తెలియాల్సిన అవసరం చాలా ఉంది. ఈ దేశంపై దండెత్తి వచ్చిన దుర్మార్గుల అన్యాయాలు వివరించి, ధర్మంపై జరిగిన దాడి గురించి అవగాహన పరచడంతో పాటు వివిధ కార్యక్రమాల ద్వారా నేటి సమాజాన్ని స్వాగతం చేయడం బజరంగ్ దళ్ ప్రధాన కర్తవ్యం.

ఈ దేశ సమగ్రతకు పెనుముప్పుగా సంక్రమిస్తున్న పలు ప్రమాదకర విషయాలపై యువతను మేల్కొల్పడం, ఈ దేశ పౌరులందరూ సమానమే అయినప్పుడు, సమన్యాయం కోసం పోరాడాలనే విషయాలు అవగాహన పరచడం అవసరం. మెజారిటీ- మైనారిటీ అంటూ ఒకే దేశంలోని ప్రజలు రెండు రకాలుగా రెండు న్యాయవ్యవస్థలను, రెండు చట్టాలను కలిగి ఉండటం  అసహజం. 

 
దేశ ప్రజలందరూ ఒకటే అనే భావన తీసుకొచ్చేందుకు కామన్ సివిల్ కోడ్ ను తీసుకొచ్చే విషయంలో మద్దతుగా ఉండటం, వర్గాల వారిగా, మతాలవారీగా పనిగట్టుకొని జనాభాను పెంచుతున్న వారిని అదుపు చేసి జనాభా సమతుల్యం పాటించడం అత్యవసరం. జిహాదీల ముసుగులో చేస్తున్న అరాచకాలు.. ఆడపిల్లల అవహరణ (లవ్ జిహాద్), మతమార్పిడులు, దేవాలయల భూకబ్జాలు,  గోహత్యలు.. తదితర విషయాలపై అవగాహన పరచడంతో పాటు యువతను చైతన్యం చేసి తీరాల్సిందే.

ముఖ్యంగా దేశం అభివృద్ధి చెందాలంటే యువత జాగృతం కావాలి. జరుగుతున్న పరిణామాలపై సంపూర్ణ సమాచారం తెలిసి ఉండాలి. రాజ్యాంగంలోని హక్కులు పొందడంతో పాటు, దేశ భద్రతను బాధ్యతగా మసులుకోవడం యువత కర్తవ్యం. ఇదే సందర్భంగా దేశంలోని అనేక విషయాలను, పూర్వ చరిత్రను అవగాహనపరిచి యువతను జాగృతం చేసేటందుకోసమే బజరంగ్ దళ్  “శౌర్య జాగరణ యాత్ర ”  ప్రధాన లక్ష్యం.