భారత్‌ ఓ ఆర్థిక శక్తి.. స్వరం మార్చిన ట్రూడో

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య విషయంలో భారత్‌పై అసాధారణ ఆరోపణలు చేసిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తాజాగా తన స్వరం మార్చారు. భారత్‌తో దృఢమైన సంబంధాలు ఏర్పరుచుకునేందుకు కట్టుబడి ఉన్నామంటూ చెప్పుకొచ్చారు. భారత్ పై తమ వద్ద విశ్వసనీయమైన ఆరోపణలు ఉండనే ఉన్నాయని అయితే వీటితో సంబంధం లేకుండా బంధం విస్తరించు కోవాలనుకుంటున్నట్లు చెప్పారు.
 
భారతదేశం ఇప్పుడు ఎదుగుతున్న ఆర్థిక శక్తిగా ఉందని, ఈ దేశంతో సన్నిహిత సంబంధాలను స్థాపించుకోవాలని తాము చిత్తశుద్ధితో యత్నిస్తున్నామని స్పష్టం చేశారు. భారత్ అత్యంత కీలకమైన భౌగోళిక రాజకీయ శక్తిగా ఉందని చెప్పారు. కెనడా- భారత్  నడుమ చిరకాల సంబంధాల గురించి అందరికీ తెలిసిందేనని తెలిపారు.

‘భారతదేశం అభివృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తి. భౌగోళిక రాజకీయాల పరంగా ముఖ్యమైన దేశం. భారత్‌తో దృఢమైన బంధాన్ని పెంపొందించుకునేందుకు మేము కట్టుబడి ఉన్నాం. మేం గతేడాదే మా ఇండో-పసిఫిక్‌ వ్యూహంతో ముందుకొచ్చాం. భారత్‌తో చట్టబద్ధ పాలనకు చాలా సీరియస్‌గా పనిచేస్తున్నాం’ అని వ్యాఖ్యానించారు.

అదేవిధంగా నిజ్జర్‌ హత్య విషయంలో అమెరికన్లు తమతోనే ఉన్నారని ట్రూడో ప్రకటించారు. ఈ విషయంలో కెనడా, దాని మిత్రదేశాలు భారత్‌తో కలిసి నిర్మాణాత్మకంగా పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అదే సమయంలో చట్టాలను అనుసరించే దేశంగా, నిజ్జర్‌ హత్య విషయంలో వాస్తవాలను వెలికి తీసేందుకు తమతో కలిసి భారత్‌ పనిచేయాల్సిన అవసరం ఉందని ట్రూడో తెలిపారు.

అయితే ఈ విషయం వేరు , భారత్‌తో సంబంధాలు వేరని ఆయన స్పష్టం చేశారు. భారతదేశం ప్రగతిపథంలో దూసుకువెళ్లుతోందని, రాజకీయ భౌగోలిక అధికార కేంద్రమని విషయాన్నీ కాదనలేమని చెప్పారు. గత ఏడాదే తాము ఇండో పసిఫిక్ వ్యూహం ప్రకటించామని గుర్తు చేశారు. దీని మేరకు భారత్ తో సన్నిహిత సంబంధాలనే ఆశిస్తున్నట్లు కెనడా ప్రధాని తెలిపారు.