
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న మధ్యప్రదేశ్లో ప్రతిపక్ష కాంగ్రెస్పై తీవ్ర దాడిని ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ తన విధానాలను “అర్బన్ నక్సల్స్”కు అవుట్సోర్సింగ్ చేసిందని, మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించకుండా అడ్డుకుంటున్నదని ప్రధాని ఆరోపించారు.
కాంగ్రెస్కు అధికారంలోకొస్తే రాష్ట్రం మళ్లీ బీమారు (రోగిష్టి) రాష్ట్రంగా మారుతుందని మోదీ రాష్ట్ర ప్రజలను హెచ్చరించారు. భోపాల్లో జరిగిన జన్ ఆశీర్వాద్ (ప్రజా ఆశీర్వాదం) యాత్ర ముగింపు సందర్భంగా మోదీ కార్యకర్త మహాకుంభ్లో ప్రసంగించారు, ఇది మొత్తం 230 అసెంబ్లీ నియోజకవర్గాల గుండా ప్రయాణించి, 10,000 కిలోమీటర్లకు పైగా నడిచింది.
ఈ యాత్రలో పాల్గొన్న అనేక మంది బీజేపీ ముఖ్యమంత్రులు, సీనియర్ నాయకుల నేతృత్వంలో సనాతన ధర్మాన్ని నిర్మూలించడానికి ప్రయత్నిస్తున్నదంటూ కాంగ్రెస్ పై దాడులు చేశారు. “మిత్రులారా, ఈ రోజు నేను మన దేశ ప్రజలకు, మధ్యప్రదేశ్ ప్రజలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. కాంగ్రెస్ తన నిర్ణయాధికారాన్ని పూర్తిగా వదులుకుంది” అని ప్రధాని చెప్పారు.
“క్షేత్రస్థాయిలో కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు నోటికి తాళాలు వేసుకుని మౌనంగా కూర్చోవడం మనం చూస్తున్నాం. కాంగ్రెస్ ఇంతకు ముందు నాశనమైంది, ఇప్పుడు దివాళా తీసింది. వారు తమ కాంట్రాక్టులను ఇతరులకు అప్పగించారు. కాంగ్రెస్ స్లోగన్స్ నుండి పాలసీల వరకు అన్నింటినీ అవుట్ సోర్సింగ్ చేసే కంపెనీగా మారింద” అంటూ మోదీ ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ కాంట్రాక్ట్ ఎవరిది? ఇప్పుడు కొంతమంది అర్బన్ నక్సల్స్తో కాంగ్రెస్ కు ఒప్పందం ఉంది. కాంగ్రెస్లో అర్బన్ నక్సల్స్ హవా నడుస్తోంది. ఇది ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు క్షేత్రస్థాయిలో అనిపిస్తుంది. అందుకే కాంగ్రెస్ క్షేత్రస్థాయిలో నిరంతరం దిగజారిపోతోందని మోదీ తెలిపారు. కాంగ్రెస్ పార్టీని తుప్పుపట్టిన ఇనుముగా ఆయన అభివర్ణిస్తూ వర్షంలో నానితే కూలిపోవడం ఖాయమని ఆయన విమర్శించారు.
సనాతన ధర్మమును అంతం చేయాలని చూస్తున్న కాంగ్రెస్, దాని “ఘమదీయ కూటమి” పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన ప్రజలను కోరారు. పార్లమెంట్, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీని నెరవేర్చామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
కాంగ్రెస్, ఇండియా కూటమి భాగస్వాములు బలవంతం వల్లే ఈ బిల్లుకు మద్దతిచ్చారని చెబుతూ వారి కూటమిలోని వ్యక్తులే ఈ బిల్లు 20 ఏళ్లుగా ఆమోదింపకుండా చేశారని ప్రధాని మండిపడ్డారు. తప్పనిసరి పరిస్థితులు వారిని బలవంతం చేయడంతో గత్యంతరం లేక వారు బిల్లుకు మద్దతు ఇవ్వాల్సి వచ్చిందని ఎద్దేవా చేశారు. రాజకీయ ఒత్తిడుల వల్లనే మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు పలికారని మోదీ స్పష్టం చేశారు.
“నేను మీకు మరో విషయం చెప్పాలనుకుంటున్నాను, వారు ఖచ్చితంగా కొత్త గేమ్ ఆడతారు… వారు మహిళా శక్తిని విభజించడానికి ప్రయత్నిస్తారు. మహిళలు ఏకం కావడం వారికి ఇష్టం లేదు. గుర్తుంచుకోండి. ద్రౌపది ముర్ము అనే ఆదివాసీ మహిళను రాష్ట్రపతి కాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారు, ఆమెను పదే పదే అవమానించారు. దేశ రక్షణ దళాల్లో కుమార్తెల ప్రవేశాన్ని వ్యతిరేకించిన వారు కూడా వీరే’’ అంటూ ప్రధాని ప్రతిపక్షాలపై విరుచుకు పడ్డారు.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు